ETV Bharat / state

CABINET MEETING: కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

author img

By

Published : Sep 16, 2021, 5:01 AM IST

Updated : Sep 16, 2021, 2:10 PM IST

శాసనసభ సమావేశాల ఖరారుతో పాటు దళితబంధు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరికొద్దిసేపట్లో సమావేశం కానుంది. ఉద్యోగ ఖాళీల భర్తీ, ధాన్యం కొనుగోళ్లు, వరిసాగు, కరోనా సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మైనింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి కొత్త పాలసీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయ పున:ప్రారంభం సహా ఇతర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

telangana-cabinet-meeting-today
telangana-cabinet-meeting-today

రాష్ట్ర మంత్రివర్గం మరికొద్దిసేపట్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో ఈ మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిశాయి. అప్పటి నుంచి ఆర్నెళ్లలోపు అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. దీంతో సమావేశాల నిర్వహణపై కేబినెట్​లో చర్చించనున్నారు. వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరగనుంది. గృహ నిర్మాణ సంస్థ, కొండాలక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాలకు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది. వాటి స్థానంలో ఉభయసభల్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. దళితబంధు పథకంపై కూడా కేబినెట్​లో చర్చ జరగనుంది. హుజూరాబాద్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. దీంతోపాటు దళితబంధు పథకం అమలు, కార్యాచరణ, లబ్ధిదారులకు యూనిట్ల ఎంపిక, మంజూరు సహా సంబంధిత అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దళితబంధుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు సంబంధించిన బిల్లు రూపకల్పనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చ..

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ కసరత్తు దాదాపుగా పూర్తైంది. 65 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. నియామకాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వరిధాన్యం సాగు అంశం కూడా ప్రస్తావనకు రానుంది. బాయిల్ట్ రైస్​ను కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. కొనుగోళ్లు, యాసంగిలో సాగుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆయిల్ పామ్ విస్తరణపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వాటితో పాటు ప్రాజెక్టులు, జలవివాదాలు, సంబంధిత అంశాలపై కూడా కొత్త మైనింగ్ పాలసీపై కేబినెట్​లో చర్చ జరగనుంది. మైనింగ్​లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కొత్త మైనింగ్ పాలసీపై కేబినెట్​లో చర్చ జరగనుంది.

కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్​పై చర్చ..

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్​పై కేబినెట్ సమీక్షించనుంది. జిల్లాల వారీగా కొవిడ్ పరిస్థితిపై చర్చించడంతో పాటు వ్యాక్సినేషన్​పై దృష్టి సారిస్తారు. అర్హులైన వారందరికీ టీకాలే లక్ష్యంగా రోజుకు మూడు లక్షలు చొప్పున ఇవాళ్టి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. తదుపరి కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయ పున:ప్రారంభం అంశం కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ లేదా నవంబర్​లో ఆలయ ఉద్ఘాటన చేయాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని యాదాద్రి పున:ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులతో చర్చించిన విషయాలు, సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. ఇతర పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాలు కూడా కేబినెట్​లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా'లో ప్రధాని మోదీ

Last Updated :Sep 16, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.