ETV Bharat / state

'న్యాయనిపుణులతో చర్చించాక తదుపరి కార్యాచరణపై నిర్ణయం'

author img

By

Published : Mar 17, 2021, 6:58 AM IST

CID Notices To Chandrababu News
'న్యాయనిపుణులతో చర్చించాక తదుపరి కార్యాచరణపై నిర్ణయం'

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని కోర్టులో సవాలు చేయాలన్న యోచనలో తెదేపా అధినేత చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. తొలుత కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి... ఇప్పుడు తనదాకా వచ్చారన్న అభిప్రాయాన్ని ముఖ్యనేతల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏ తప్పు చేయనప్పుడు ఇలాంటి వాటికి భయపడాల్సిన పని లేదని... ధైర్యంగానే ఎదుర్కొంటానని చంద్రబాబు నేతలతో అన్నట్లు తెలిసింది. ఇవాళ ఏలూరు వెళ్లి సాయంత్రం అమరావతికి చేరుకోనున్న చంద్రబాబు... న్యాయనిపుణులతో చర్చించాక తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

'న్యాయనిపుణులతో చర్చించాక తదుపరి కార్యాచరణపై నిర్ణయం'

తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలు రావుల చంద్రశేఖర రెడ్డి, పయ్యావుల కేశవ్‌, నల్లారి కిషోర్​కుమార్​ రెడ్డిలతో సమావేశమయ్యారు. సీఐడీ నోటీసుల అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సీఐడీ నోటీసులు వ్యవహారం ఊహించిందేనన్న చంద్రబాబు... ఎలాంటి సంఘటనలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వారితో అన్నట్లు సమాచారం.

రాజధాని నిర్మాణానికి సంబంధించి తీసుకున్న ప్రతి నిర్ణయమూ పారదర్శకంగానే చేపట్టినందునా... ఇలాంటి తప్పుడు కేసులు తననేమీ చేయలేవనే ధీమాను చంద్రబాబు వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి సీఐడీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై విచారణకు హాజరవ్వాలా... లేదా అనేదానిపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసులు పెట్టారని.. న్యాయపోరాటం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. చంద్రబాబు ఇవాళ ఏలూరు వెళ్లనున్నారు. కుమారుడు చనిపోయిన విషాదంలో ఉన్న మాజీఎంపీ మాగంటి బాబును పరామర్శించనున్నారు.

అమరావతి రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు స్పందించి ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే పదమే లేదని హైకోర్టు చెప్పినా, పది సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. అసలు నేరమే లేనప్పుడు చంద్రబాబు నేరస్తుడు ఎలా అవుతారని వారు నిలదీశారు.

ఏపీలో నియంత పాలన సాగుతోందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. జగన్‌ ఫ్యాక్షన్‌ పోకడలతో రాష్ట్రం నాశనమవుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు కక్షసాధింపేనని విమర్శించారు. ఇదంతా జగన్‌ ఆడుతోన్న మైండ్‌ గేమ్‌ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఎదుర్కోవడం వైఎస్‌ వల్లే కాలేదని... జగన్‌ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు.

రాజధాని భూముల విషయంలో ఎమ్మెల్యే ఆర్కే మాటని తీసుకుని చంద్రబాబుకి సీఆర్‌పీసీ నోటీసులివ్వడం సహేతుకం కాదని ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించారని మాజీమంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ జగన్‌ కక్షపూరితంగా చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ ప్రయత్నించడం ఆయన డొల్లతనాన్ని బయటపడుతోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గతంలో రాజశేఖర్‌ రెడ్డి ఇడుపులపాయలో 690 ఎకరాలు అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నట్లు అసెంబ్లీలో ఒప్పుకుని... భూములు తిరిగి ఇచ్చేస్తానని 300 ఎకరాలే వెనక్కి ఇచ్చి మిగతా 290 ఎకరాలు తమ ఎస్టేట్​లో కలుపుకోవటం నిజం కాదా..? అని నిలదీశారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏమీ తేల్చని జగన్‌ ప్రభుత్వం.. కక్ష సాధించడానికే చంద్రబాబుకి నోటీసులిచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ తాత్కాలిక ఆనందం కోసం తాపత్రయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై మోపిన అభియోగం రాజకీయ వ్యవస్థకే సిగ్గు చేటని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. ఎస్సీలను మోసం చేసి భూములు లాక్కుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైకాపా కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎలా వాడుకుంటారని... అసైన్డ్ రైతులకు సామాన్య రైతులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వడం చంద్రబాబు చేసిన నేరమా అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ ప్రశ్నించారు. జగన్ చర్యలతో పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని మండిపడ్డారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్​కు బీటలు వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చారని తెదేపా విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మండిపడ్డారు.

అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని ఇప్పటి వరకు ఎస్సీలెవ్వరూ ఫిర్యాదు చేయలేదని... కేవలం ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని పార్టీ అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్‌ బాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేశామని... చంద్రబాబుపై కేసులు పెట్టామని సంబరపడవద్దని... ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. చిల్లర రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కాని... కనీసం అసైన్డ్‌ భూముల లబ్ధిదారు కాని ఆర్కే ఫిర్యాదుపై ఎలా ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమ కేసులను ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.