ETV Bharat / state

బాల్యాన్ని కబళిస్తోన్న క్షయ.. హైదరాబాద్‌లోనే అత్యధికంగా..!

author img

By

Published : Jan 2, 2023, 9:40 AM IST

TB Cases in Telangana : రాష్ట్రంలో క్షయ(టీబీ) మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వేల మంది ప్రాణాలను కబళిస్తోంది. కరోనా వంటి కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నా.. టీబీ మాత్రం ఏళ్లుగా పట్టిపీడిస్తూనే ఉంది. దీని కోరల్లో ఏటా కొత్తగా వేల మంది చిక్కుకుంటూనే ఉన్నారు. 2022లో మొత్తం బాధితుల సంఖ్య 64 వేలకు చేరింది. వీరిలో సుమారు 8 శాతం మంది 15 ఏళ్లలోపు వయసు పిల్లలుండటం గమనార్హం.

TB
TB

TB Cases in Telangana : రాష్ట్రంలో క్షయ (టీబీ) మహమ్మారి బాల్యాన్ని కబళిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా.. ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి సమూల నిర్మూలన సాధ్యం కావడం లేదు. పెద్దలు, పిల్లలు కలిపి ఏటా 60 వేల మందికి పైగా టీబీ కోరల్లో చిక్కుకుంటున్నారు. 2022లో మొత్తం బాధితుల సంఖ్య 64 వేలకు చేరింది. వీరిలో సుమారు 8 శాతం మంది 15 ఏళ్లలోపు వయసు పిల్లలుండటం గమనార్హం. హైదరాబాద్‌లో 15 శాతానికి పైగా పిల్లలు క్షయ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో క్షయ పీడిత బాలలు 2017లో 10 శాతం నమోదయ్యారు. 2022 నాటికి అది 8 శాతానికి తగ్గినా.. పూర్తి నివారణ ఇంకా సుదూరంగానే ఉంది. పరిపూర్ణ చికిత్స పొందిన వారిలో దాదాపు 90 శాతం మంది వ్యాధిని పూర్తిగా జయించారని గణాంకాలు చెబుతున్నాయి. అవగాహన లేమి కారణంగా ఏటా పిల్లలు, పెద్దలు కలిపి రెండు వేల మందికి పైగా క్షయ కారణంగా చనిపోతున్నారు. పెద్దల్లో సుమారు 3 శాతం, పిల్లల్లో 1 శాతం మరణాలు సంభవిస్తున్నాయి.

టీకా ఇస్తున్నా..: శిశువు పుట్టిన 24 గంటల్లోపు క్షయను నివారించే బీసీజీ టీకా ఇస్తారు. లేదా పుట్టిన రెండేళ్లలోపు ఎప్పుడైనా ఇప్పించవచ్చు. పుట్టే శిశువుల్లో దాదాపు 99 శాతం మందికి బీసీజీ ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షయ బాధిత బాలలు ఇంకా 8 శాతం ఉండడమేమిటన్నది ప్రశ్న. పిల్లలకు 10-12 ఏళ్లు వచ్చేసరికి టీకా సమర్థత తగ్గడం దీనికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడుతున్న పిల్లల్లో 70 శాతం మంది 12-15 ఏళ్ల వయసు వారే. వ్యాధి సోకే పిల్లల్లో 3-5 శాతం మందికి మాత్రమే మందులు ఇవ్వగలుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ఇళ్ల వద్ద కాన్పు జరిగినా.. శిశువులకు కచ్చితంగా బీసీజీ టీకా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

ఇంట్లో పెద్దలకు సోకితే..: జుట్టు, గోళ్లు మినహా అన్ని అవయవాలకూ క్షయ సోకే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఊపిరితిత్తులు, ఎముకలు, పేగులు, మూత్రపిండాలు, మెదడు, వెన్నెముక, శోషరస గ్రంథుల (లింఫ్‌ నోడ్స్‌)కు సోకుతుంది. ఇంట్లో పెద్దవారిలో ఎవరికైనా క్షయ సోకితే.. ఆ ఇంట్లో ఆరేళ్లలోపు పిల్లలందర్నీ పరీక్షిస్తారు. పెద్దల నుంచి వారికి సోకకుండా ఉండేందుకు ‘ఐసోనియాజిడ్‌ (ఐఎన్‌హెచ్‌)’ మాత్రలు ఇస్తారు. వాటిని ఆరు నెలలపాటు తప్పనిసరిగా వాడాలి. సుమారు 10 శాతం మంది పూర్తిస్థాయిలో మందులు వాడకపోవడంతో ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో లక్షణాలివీ..

* పెద్దల్లో మాదిరిగా తీవ్ర దగ్గు ఉండదు.

* ఆకలి తగ్గిపోతుంది. తినాలని బలవంతం చేస్తే ఏడుస్తారు.

* పిల్లల్లో వయసుకు తగ్గట్లుగా ఎదుగుదల ఉండదు. బరువు పెరగరు.

* సాయంత్రం వేళల్లో జ్వరం వస్తుంది.

* మెడ పక్కన లింఫు గ్రంథుల్లో వాపు, గడ్డల్లాగా వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యాన్ని పెంచుతాం..

'క్షయ నిర్మూలనకు కార్యాచరణను ముమ్మరం చేశాం. వ్యాధి నిర్ధారణకు అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. బాధిత చిన్నారులకు ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన’ కింద నెలకు రూ.500 చొప్పున, గిరిజనులకు రూ.500కు అదనంగా ఒక్కసారి మాత్రం రూ.750 చొప్పున పారితోషికం అందిస్తున్నాం. వ్యాధిగ్రస్థుల సమాచారాన్ని అందించినవారికి రూ.500, రోగికి ఆరు నెలలపాటు పూర్తి చికిత్స అందించినందుకు వైద్యునికి రూ.1000, వ్యాధి తిరగబెట్టిన రోగికి పూర్తి చికిత్స ఇచ్చినందుకు వైద్యునికి రూ.5 వేల చొప్పున పారితోషికం అందిస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపు 90 శాతం మంది వ్యాధిగ్రస్థులను గుర్తిస్తున్నాం. కానీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారి సంఖ్య నమోదు కావడం లేదు. ఈ ఏడాది ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి సారించాం.'- డాక్టర్‌ ఆడెపు రాజేశం, సంయుక్త సంచాలకులు, జాతీయ ఆరోగ్య మిషన్‌ క్షయ నిర్మూలన పథకం

.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.