ETV Bharat / state

ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

author img

By

Published : Feb 2, 2020, 7:36 AM IST

software-employee-work-for-environment-in-hyderabad
ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

అతనో పర్యావరణ ప్రేమికుడు. భాగ్యనగరాన్ని పర్యావరణ హితంగా చేయాలని తలచాడు. ప్లాస్టిక్​ వాడకాన్ని నివారించేందుకు ముందుకు కదిలాడు. తనొక్కడినే చేయగలనా అనే సందేహాలు పెట్టుకోలేదు. ఎవరి సాయమూ తీసుకోలేదు. స్వయంగా నర్సరీని ఏర్పాటు చేసి ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నాడు. 'ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మీకు నచ్చిన పూల మొక్కలను తీసుకెళ్లండి' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

ప్లాస్టిక్​ను నివారించాలని.. పర్యావరణాన్ని కాపాడాలని.. ఇలా ఎవరు చెప్పినా వింటాం. పది మందికి చెప్తాం. కానీ మనమే పాటించం. మన ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అనుకుంటాం. యథేచ్ఛగా ప్లాస్టిక్​ను వాడేస్తాం. కానీ హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని రాక్​టౌన్​ కాలనీలో నివాసం ఉంటున్న దోసపాటి రాము అలా అనుకోలేదు. తన వంతు పర్యావరణానికి మేలు చేయాలని... కొంతమందిలోనైనా మార్పు తీసుకురావాలని తలచాడు.

చేతి నిండా ప్లాస్టిక్​తో రండి..

రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించాడు. ఇప్పటికే వినియోగించిన ప్లాస్టిక్​ను వెనక్కి తీసుకొచ్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్​ ఎల్బీనగర్​ నుంచి నాగోల్​ వెళ్లే రహదారిలో నర్సరీని ఏర్పాటు చేశాడు. 'ప్టాస్టిక్​ కవర్లతో రండి.. మీకు నచ్చిన పూల మొక్కలను తీసుకెళ్లండి' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పుణె నుంచి మొక్కలు తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.

రాము చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సమీపంలో నివసించే వారెందరో అక్కడకు వచ్చి నచ్చిన మొక్కలను తీసుకెళ్తూ రామును అభినందిస్తున్నారు. మహానగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరాడు. ప్లాస్టిక్​ వాడకాన్ని నివారించి.. విరివిగా మొక్కలు పెంచాలని నగరవాసులను కోరుతున్నాడు.

ఇవీచూడండి: 'చివరి శ్వాస వరకు ఉచితంగా వైద్యం అందిస్తా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.