Rythu Bandhu Funds Releasing Today : నేటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ

author img

By

Published : Jun 26, 2023, 6:59 AM IST

Rythu Bandhu Funds Releasing Today

CM KCR Releases Rythu Bandhu Funds Today : రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి సర్కారు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేటి నుంచి అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేలు చొప్పున జమ కానుంది. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో.. నిర్థేశిత గడువులోగా పెట్టుబడి సాయం జమ చేసేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. తొలిసారిగా లక్షా 50 వేల మంది పోడు రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

'నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ'

Rythu Bandhu Scheme Funds Releasing Today : రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభం కానుంది. 11వ విడత రైతుబంధు ఇవాళ్టి నుంచి మొదలు కానుంది. ఈ ఏడాది వానా కాలం సంబంధించి 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కానుంది. తొలిరోజు గుంట భూమి నుంచి 1 ఎకరం విస్తీర్ణం గల భూయజమానులకు సాయం అందనుంది. ఈసారి అనూహ్యంగా 5 లక్షల కొత్త లబ్ధిదారులు పెరగనున్నారు. అంతేకాకుండా లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందనుండటం ఓ ప్రత్యేకత.

Rythu Bandhu Funds credits to Telangana Farmers Accounts : ఈ వానా కాలం సీజన్‌లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29 కోట్లు జమ కానున్నాయి. గతంలో కన్నా ప్రభుత్వంపై సుమారు 300 కోట్ల అదనపు భారం పడుతుంది. 11వ విడత ద్వారా రైతుల ఖాతాల్లో మొత్తం రూ.72,910 కోట్లకు చేరనున్న రైతుబంధు పథకం పెట్టుబడి సాయం కింద ఒక కోటి 54 లక్షల ఎకరాలకు అందనుంది. 10వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ సాంకేతిక పరమైన విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలో ప్రత్యేకించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిరీతిలో ఒక్క తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రత్యక్షంగా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కోసం రైతులకు నేరుగా నగదు అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

Telangana Rythu Bandhu 2023 : రాష్ట్రంలో భూమి పట్టా గల అర్హులైన ప్రతి భూయజమాని అయిన రైతుకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించాలనేది సర్కారు లక్ష్యం. ఇటీవల కాలంలో ధరణి పోర్టల్‌లో పార్ట్-2లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకున్న నేపథ్యంలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం వచ్చిన రైతులకు కూడా ఈసారి రైతుబంధు కింద సాయం అందిస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈసారి లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు వర్తింపజేసి గిరిజన రైతులకు రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Rythu Bandhu Funds In Telangana : ఈ సారి కొత్తగా మొదటిసారి రైతుబంధు సాయం తీసుకోనున్న ఆ రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంకు అకౌంటు, ఇతర వివరాల నకళ్లతో వెళ్లి సంప్రదించాలి. ఖర్చు ఎంతైనా సరే రైతు నష్టపోకూడదన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ వానాకాలం పురస్కరించుకుని రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. దేశానికి అన్నం పెట్టే తెలంగాణ రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎంకు ఉన్న ఆప్యాయతకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి సరఫరా నిదర్శనాలు అని మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో సైతం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం ఫలంగా సాగు నీటి వనరులు పెరిగడం, ఇతర వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.