ETV Bharat / state

పన్ను ఆదాయం బాగు.. పన్నేతర ఆదాయం అంచనాలకు దూరం

author img

By

Published : Dec 1, 2022, 11:51 AM IST

Telangana Revenue: రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం బాగానే సమకూరుతున్నప్పటికీ పన్నేతర ఆదాయం, గ్రాంట్లు మాత్రం అంచనాలకు చాలా దూరంలోనే ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరుకు పన్నుఆదాయం బడ్జెట్ అంచనాల్లో 55శాతాన్ని అధిగమించగా.. పన్నేతర ఆదాయం మాత్రం 34 శాతం, గ్రాంట్లు కేవలం 13 శాతం మాత్రమే ఉన్నాయి. మొదటి ఏడు నెలల్లో అన్ని రకాలుగా లక్ష కోట్లకుపైగా నిధులు సమకూరగా.. 93వేల కోట్లను సర్కార్ వ్యయం చేసింది.

Telangana Revenue
Telangana Revenue

Telangana Revenue: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 70 వేల 126 కోట్ల రూపాయల పన్నుఆదాయం సమకూరింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. లక్షా 26 వేల 606 కోట్ల పన్నుఆదాయంలో ఇది 55. 39 శాతం. అక్టోబర్ నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై ఆర్థికశాఖ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్‌కు నివేదిక సమర్పించింది. జీఎస్​టీ ద్వారా రూ. 23 వేల 493 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ. 17 వేల 329 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ. 10 వేల 320 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8 వేల 238 కోట్లు ఖజానాకు చేరాయి.

పన్నేతర ఆదాయం రూ. 8 వేల 796 కోట్లు: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ. 5 వేల 911 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ. 4 వేల 832 కోట్ల రూపాయలు వచ్చాయి. పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన మేర లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 25 వేల 421 కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేయగా.. అక్టోబర్ నెలాఖరుకు అందులో కేవలం 34 శాతం మేర రూ. 8 వేల 796 కోట్లు మాత్రమే సమకూరాయి. గ్రాంట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. వివిధ రూపాల్లో రూ. 41 వేల కోట్ల రూపాయలు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేశారు. ఏడు నెలల్లో వచ్చిన గ్రాంట్లు కేవలం రూ. 5 వేల 592 కోట్లు మాత్రమే. బడ్జెట్ అంచనాల్లో ఇది కేవలం 13శాతం మాత్రమే.

ఏప్రిల్​, మే నెలలో ఆదాయం తక్కువ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలాఖరుకు ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేల 57 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. 52 వేల 167 కోట్లలో ఇది 38 శాతంగా ఉంది. అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాకు రూ. లక్షా 5 వేల 187 కోట్లు సమకూరాయి. బడ్జెట్ అంచనా రూ. 2 లక్షల 45వేల 256 కోట్లలో ఇది 43 శాతం వరకు ఉంది. నెలల వారీగా చూస్తే ఏప్రిల్, మే నెలలు మినహాయిస్తే మిగతా ఐదు నెలల్లో ఆదాయం పదివేల కోట్ల మార్కు దాటింది.

పన్నుల ద్వారా అక్టోబర్‌లో 395 కోట్లు మాత్రమే వచ్చాయి. కేవలం రూ. 85 కోట్లు మాత్రమే గ్రాంట్ల ద్వారా ఖజానాకు చేరాయి. అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 93 వేల 478 కోట్ల రూపాయలు. అందులో రెవెన్యూ వ్యయం రూ. 84వేల 52 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ. 9 వేల 425 కోట్లు. వడ్డీ చెల్లింపుల కోసం రూ. 11 వేల 734 కోట్లు, ఉద్యోగుల వేతనాల కోసం రూ. 21 వేల 499 కోట్లు ఖర్చు చేశారు. పెన్షన్ల కోసం రూ. 8 వేల 15 కోట్లు, రాయితీలపై రూ. 5 వేల 710 కోట్లు వ్యయం చేశారు.

పన్ను ఆదాయం బాగు.. బాగు.. పన్నేతర ఆదాయం అంచనాలకు దూరం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.