ETV Bharat / state

'శ్రీనివాస్​ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.. దీనికి కేసీఆర్​ బాధ్యత వహించాలి'

author img

By

Published : Nov 23, 2022, 8:11 PM IST

Revanth Reddy letter to KCR
Revanth Reddy letter to KCR

killing of forest range officer Srinivas: ప్రభుత్వం చేతగాని తనంతోనే రాష్ట్రంలో ఫారెస్ట్​ అధికారులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు​ లేఖ రాసిన ఆయన.. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టాలని లేని పక్షంలో కాంగ్రెస్​ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

killing of forest range officer Srinivas: ప్రభుత్వం చేతగాని తనంతోనే నిజాయితీ పరుడైన కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్​ రేంజ్​ అధికారి చలమల శ్రీనివాసరావు.. గుత్తికోయల చేతిలో హత్యకు గురైయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. శ్రీనివాసరావు హత్య, పోడు భూముల వివాదంపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన.. ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని ఇందుకు సీఎం బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోందన్న ఆయన.. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. అటవీశాఖ అధికారులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతూనే ఉందన్నారు. ఎనిమిదేళ్లుగా పోడు భూములపై హక్కులు కల్పిస్తామని లబ్ధిదారులను ప్రభుత్వం ఊరిస్తూ వస్తోందని రేవంత్​ విమర్శించారు.

అటవీ భూముల్లో సేద్యం చేస్తున్నారని గిరిజనులపైకి అధికారులను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారులు, గిరిజనుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత రెండు, మూడేళ్లుగా పోడు భూముల్లో అటవీ అధికార్లు మొక్కలు నాటేందుకు రావడం.. గిరిజనులు అడ్డుకోవడం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం పరిపాటిగా మారిందన్నారు.

గతంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌, సిబ్బందిపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. గతేడాది జూలై 2న నాగర్​ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారులో ఫారెస్ట్ సెక్షన్ అధికారి మధుసూదన్ గౌడ్ బృందం, భూపాలపల్లి రేంజ్​ అధికారి కూడా దాడులకు గురైయ్యారని ఆరోపించారు. తక్షణమే పోడు భూములకు పట్టాలిచ్చే కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

అప్పటి వరకు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీల జోలికి వెళ్లకుండా అధికారులను అదేశించాలని కోరారు. విధులు నిర్వహిస్తున్న అధికారులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి చెందిన మార్గదర్శకాలను విడుదల చేయాలని.. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం చేసేందుకు కార్యచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.