హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంత మంది పోలీసుల బదిలీ - కారణమిదే!

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంత మంది పోలీసుల బదిలీ - కారణమిదే!
Police Transfers in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ఫిర్యాదులు రాగానే సీఈసీ స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్.. పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా మరికొంత మంది పోలీసు అధికారులు బదిలీ అయ్యారు.
Police Transfers in Hyderabad : అధికార పార్టీ బీఆర్ఎస్కు పోలీస్, ఎక్సైజ్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేత, సనత్నగర్ నియోజకవర్గ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి.. సీఈఓ వికాస్రాజ్కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి సైతం ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై నిజానిజాలు తెలుసుకుంటున్న ఎన్నికల సంఘం.. ఆ తర్వాత చర్యలు చేపడుతోంది. ఎన్నికల షెడ్యూల్(Telangana Election Schedule) వెలువడిన వెంటనే 10 మంది ఐపీఎస్లతో పాటు పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ బదిలీకి సీఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చర్యలు తీసుకున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెడుతోంది.
Election commission Transfers CIs in Telangana : రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరమయ్యేకొద్దీ.. కొంత మంది అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్లకే పోస్టింగ్లు దక్కాయని ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తగిన ఆధారాలు ఉన్న వాళ్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీలు చేస్తున్నారు.
BRS Congress Conflict at Achampet : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 రోజుల క్రితం 14 మంది సీఐలను సీపీ సందీప్ శాండిల్య బదిలీ చేశారు. బోరబండ, సైఫాబాద్ పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్లో పనిచేసే పలువురు సీఐలను బదిలీ(Task Force CI Transfers) చేశారు. ఎస్ఆర్నగర్ సీఐగా పనిచేసిన సైదులును బదిలీల్లో భాగంగా కీలకమైన ఉత్తర మండల టాస్క్ఫోర్స్కు పంపించారు. రాజకీయ పలుకుబడితోనే మంచి పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో సైదులును సైబర్ క్రైమ్స్కు బదిలీ చేశారు. అచ్చంపేటలో శనివారం రాత్రి గొడవలు జరిగాయి. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి(Attack on MLA Bala Raju) జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలే చేశారంటూ ఆయన ఆరోపించారు.
Comments on Telangana Police in Election Time : పోలీసుల సహకారంతో గువ్వల బాలరాజు డబ్బులు పంచుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలనే సీఐ అనుదీప్ కొట్టడంతో పాటు బెదిరింపులకు దిగారని పీసీసీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రచారం సందర్భంగా పక్షపాతం చూపిస్తున్నారని పలువురు పార్టీల నేతలు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని పలు విషయాలను పోలీసులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏ మాత్రం తేడా వచ్చినా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
