నేతల ఫిర్యాదులపై ఈసీ నజర్-జోరుగా పోలీసుల బదిలీలు

నేతల ఫిర్యాదులపై ఈసీ నజర్-జోరుగా పోలీసుల బదిలీలు
EC Orders to Police Transfers in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రాగానే సీఈసీ స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారలపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్.. పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా మరికొంత మంది పోలీసు అధికారులు బదిలీ అయ్యారు
EC Orders to Police Transfers in Telangana : అధికార పార్టీ బీఆర్ఎస్కు(BRS) పోలీస్, ఎక్సైజ్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీ నేత, సనత్నగర్ నియోజకవర్గ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి.. సీఈఓ వికాస్రాజ్కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్(Congress), బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి సైతం ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులపై నిజానిజాలు తెలుసుకుంటున్న ఎన్నికల సంఘం ఆ తర్వాత చర్యలు చేపడుతోంది.
ఎన్నికల షెడ్యూల్(Telangana Election) వెలువడిన వెంటనే 10 మంది ఐపీఎస్లతో పాటు పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ బదిలీకి సీఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చర్యలు తీసుకున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెడుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరమయ్యే కొద్దీ కొంత మంది అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Telangana Assembly Elections 2023 : బీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్లకే పోస్టింగ్లు దక్కాయని ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తగిన ఆధారాలు ఉన్న వాళ్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీలు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 రోజుల క్రితం 14 మంది సీఐలను సీపీ సందీప్ శాండిల్య బదిలీ చేశారు.
CEC focus on Police Transfers : బోరబండ, సైఫాబాద్ పీఎస్లతో పాటు టాస్క్ఫోర్స్లో పనిచేసే పలువురు సీఐలను బదిలీ చేసి లూప్లైన్లోకి బదిలీ చేశారు. ఎస్ఆర్నగర్ సీఐగా పనిచేసిన సైదులును బదిలీల్లో భాగంగా కీలకమైన ఉత్తరమండల టాస్క్ఫోర్స్ సీఐగా బదిలీ చేశారు. రాజకీయ పలుకుబడితోనే మంచి పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో సైదులును సైబర్ క్రైమ్స్కు బదిలీ చేశారు.
అచ్చంపేటలో శనివారం రాత్రి గొడవలు జరిగాయి. ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్పై(Achampet Attack) దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసుల సహకారంతో గువ్వల బాల్రాజ్ డబ్బులు పంచుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలనే సీఐ అనుదీప్ కొట్టడంతో పాటు బెదిరింపులకు దిగాడని టీపీసీసీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
పోలీసులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు : ప్రచారం సందర్భంగా పక్షపాతం చూపిస్తున్నారని పలువురు పార్టీల నేతలు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి మొదలు కొని పలు విషయాలను పోలీసులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల సంఘం మరికొంత మంది పోలీసు అధికారులను బదిలీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అకస్మిక బదిలీలపై పోలీస్ శాఖలోనూ చర్చ జరుగుతోంది.
