ETV Bharat / state

Mylardevpalli Double Murder Case Update : చిల్లర డబ్బుల కోసం 8 మంది ప్రాణాలు తీశాడు..

author img

By

Published : Jun 22, 2023, 10:47 PM IST

Pshyco
Pshyco

Psycho Serial Killer In Hyderabad : చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి.. నేరాలబాట పట్టాడు. దొంగతనాలతో మొదలైన నేరాలు హత్యల వరకు దారి తీశాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు ఏకంగా 8 హత్యలకు పాల్పడ్డాడు ఆ నిందితుడు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా.. డబ్బుల కోసం తిరిగి హత్యలు చేశాడు. మైలార్​దేవ్​పల్లి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పాత హత్యలు సైతం వెలుగులోకి వచ్చాయి. చిల్లర డబ్బుల కోసం నిందితుడు హత్యలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Police Arrested Psycho Serial Killer In Hyderabad : రహదారుల పక్కన నిద్రించే యాచకులను లక్ష్యంగా ఎంచుకోవడం.. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వాళ్ల పక్కనే నిద్రపోయినట్లు నటించడం, ఆ తర్వాత తలపై రాయితో మోది హత్య చేయడం.. ఇదీ బ్యాగరి ప్రవీణ్ నేర చరిత్ర. గంజాయి, కల్లుకు అలవాటు పడిన ప్రవీణ్.. చిల్లర డబ్బుల కోసం హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

మైరాల్‌దేవ్​పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. కాటేదాన్, దుర్గానగర్ చౌరస్తాలో జరిగిన హత్యలు ఒకరే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతులు ఇద్దరూ రహదారి పక్కనే నిద్రపోయి ఉండటం.. ఇద్దరి తలలపైనా రాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Psycho Serial Killer Arrested In Hyderabad : ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాలను కూడా సేకరించారు. మైలార్‌దేవ్​పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ప్రవీణ్.. ఈ హత్యలు చేసినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీన నేతాజీ నగర్‌లో జరిగిన యాచకుడి హత్య కేసులోనూ బ్యాగరి ప్రవీణ్ నిందితుడిగా తేలింది. పది రోజుల వ్యవధిలోనే ప్రవీణ్ 3 హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

"జంట హత్యల కేసులో నిందితుడు అంతకుముందు మరో ఆరుగురిని హత్య చేశాడు. ఇదంతా కేవలం కల్లు గురించే చేశాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన కేసులో ఇతనితో పాటు నరేష్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ ఎనిమిది నెలలు అతను ఏం చేశాడో సీసీ కెమెరాల్లో పరిశీలిస్తాం." - జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ

జంట హత్యల కేసులో నిందితుడు బాగోతం.. ఏకంగా 8 హత్యలు

ప్రవీణ్‌ నేర చరిత్ర : బ్యాగరి ప్రవీణ్ ఇప్పటి వరకు 8 మందిని హత్య చేసినట్లు మైలార్‌దేవ్​పల్లి పోలీసుల దర్యాప్తులో తేలింది. 2010లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రవీణ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుని భార్యపై అత్యాచారంలో బ్యాగరి ప్రవీణ్‌కు ఫయాజ్, నరేశ్‌ అనే ఇద్దరు నిందితులు సహకరించినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా 2011లో అత్తాపూర్‌లోని హైదర్‌గూడ వద్ద గుర్తు తెలియని యాచకుడిని హత్య చేసి అతని వద్ద నగదును ఎత్తుకెళ్లాడు. అదే ఏడాది బుద్వేల్‌లో ప్రకాశ్‌ అనే యాచకుడిని హత్య చేసి డబ్బులు తీసుకెళ్లాడు.

ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, కుమారుడి హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. మిగతా ఇద్దరు యాచకుల కేసులో 2014లో ప్రవీణ్ నిర్దోషిగా బయటపడ్డాడు. కుటుంబ హత్య కేసులో ప్రవీణ్ గతేడాది అక్టోబరులో జైలు నుంచి బయటికి వచ్చాడు. రాజేంద్రనగర్‌లోని మాణిక్యమ్మ కాలనీలో నివాసం ఉండే ప్రవీణ్.. అదే గ్రామానికి చెందిన కుటుంబాన్ని హత్య చేయడంతో గ్రామస్థులు వెలివేశారు. ఈ నెల 8వ తేదీన ఒక హత్య, 21వ తేదీ తెల్లవారుజామున జంట హత్యలు చేశాడు. ప్రవీణ్ పైన దోపిడీ, దొంగతనం కేసులు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.