Couple attacked on Suspicion of Black Magic : చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి..
Couple attacked on Suspicion of Black Magic in Sangareddy : ఆధునికంగా మానవుడు అభివృద్ధి చెందుతున్నా.. కొంతమంది వ్యక్తులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలతోనే జీవిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే.. పక్కవారు చేతబడి చేశారనే అనుమానం పెంచుకుంటున్నారు. తాజాగా చేతబడి చేశారంటూ ఓ దంపతులను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరులో జరిగింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది.
స్థానికంగా నివసిస్తున్న బాధిత భార్యాభర్తల ఇంటి పక్కన వారి కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవ్వగా.. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని ఆశ్రయించారు. మీ ఇంటి పక్కన వారే మీకు చేతబడి చేశారని సదరు వ్యక్తి చెప్పడంతో.. బాధిత దంపతులను గ్రామస్థులు పంచాయతీ సమీపానికి పిలిపించారు. అనంతరం వారిని చెట్టుకు వేలాడదీసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత భార్యాభర్తలను విడిపించి ఆస్పత్రిలో చేర్పించారు. 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.