ETV Bharat / state

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు

author img

By

Published : Feb 24, 2021, 7:39 PM IST

Updated : Feb 24, 2021, 8:54 PM IST

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్​కుమార్​ హెచ్ఛార్సీలో ఫిర్యాదు చేశారు. అమ్మాయి జీవించే హక్కు కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారని ఆయన తప్పుబట్టారు. కిడ్నాప్​ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్​మీట్​లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు
బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై... హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కిడ్నాప్ ఘటన సందర్భంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి... ప్రెస్ మీట్​లు పెట్టడం కారణంగా విద్యార్థిని మానసికంగా కుంగిపోయిందని న్యాయవాది కమిషన్​కు వివరించారు. పోలీసులు కొన్ని కేసుల్లో ముద్దాయిలను, నేరస్థులను మీడియా ముందు ప్రవేశపెడుతున్నారని... కోర్టులు చేయాల్సిన పనిని పోలీసులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తొందరపాటు చర్యల కారణంగా విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు

పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించడం కారణంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహనికి మరొకరు బలికాకుండా ఉండాలనే ... ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఛార్సీని కోరినట్లు ఆయన తెలిపారు. బాధిత యువతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని అరుణ్​ కుమార్​ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కిడ్నాప్‌ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Feb 24, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.