మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై... హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కిడ్నాప్ ఘటన సందర్భంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి... ప్రెస్ మీట్లు పెట్టడం కారణంగా విద్యార్థిని మానసికంగా కుంగిపోయిందని న్యాయవాది కమిషన్కు వివరించారు. పోలీసులు కొన్ని కేసుల్లో ముద్దాయిలను, నేరస్థులను మీడియా ముందు ప్రవేశపెడుతున్నారని... కోర్టులు చేయాల్సిన పనిని పోలీసులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తొందరపాటు చర్యల కారణంగా విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించడం కారణంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహనికి మరొకరు బలికాకుండా ఉండాలనే ... ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఛార్సీని కోరినట్లు ఆయన తెలిపారు. బాధిత యువతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య