ETV Bharat / state

మిరప పంటకు తెగుళ్ల ముప్పు - రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలపై ఎఫెక్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 11:13 AM IST

Pest Attack on Chilli Mirchi in Telangana : రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెరిగిన పెట్టుబడులకు తోడు చీడపీడల దాడితో మిర్చి సాగు తలకు మించిన భారమవుతోంది. చీడపీడల నివారణకు ఎన్ని పురుగుమందులు వాడిన ఫలితం లేదని కర్షకులు వాపోతున్నారు. దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Huge Losses to Mirchi Farmers
Pest Attack on Chilli Crop

Pest Attack on Mirchi Crop in Telangana : తెలంగాణలో మిర్చి పంటకు వేరుకుళ్లు తెగుళ్లు, నల్ల తామర, మచ్చ, కాయకుళ్లు, ఆకుముడత, కొమ్మ ఎండు తెగుళ్లు సోకుతున్నాయి. చలికాలం ఆరంభం నుంచి తెగుళ్ల ఉద్ధృతి వల్ల కొమ్మలు ఎండుతున్నాయి. కాత, పూత దెబ్బతినడంతో పాటు కాయలు రాలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 జిల్లాల్లో 9 లక్షల ఎకరాల్లో మిర్చి పంట(Michi Crop) సాగవుతోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు.

మిర్చి మంటలు - జెండాట కొండంత - వ్యాపారుల ధర గోరంత

Mirchi Cultivation in Telangana : వీటితో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్‌, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట జిల్లాల్లోనూ పంట సాగవుతోంది. గత నాలుగేళ్లుగా మిర్చికి మంచి ధర పలుకుతుండటంతో పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మిర్చి పంటలో సాధారణ రకంతో పాటు వండర్‌హాట్‌, యూస్‌, తేజ, చపాటా తదితర రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు.

చపాటాకు(Chapata Mirchi) గతేడాది భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) దక్కింది. ప్రస్తుత సీజన్‌లో గతేడాది సెప్టెంబరులో పంట వేయగా ఎదుగుదల దశలో తెగుళ్ల బెడద ప్రారంభమైంది. ఈసారి చలి ఎక్కువగా ఉండటంతో వాటి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో మచ్చ తెగుళ్లు, ఆకుముడత వల్ల పంటలో ఎదుగుదల లేదు. ఆకులు పెళుసుగా మారి, కాయ ఎండిపోవడం, రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం జరుగుతోంది.

పాతాళానికి పడిపోయిన పత్తి ధరలు - నష్టాల మూటలే రైతన్నకు దిగుబడులు

Huge Losses to Mirchi Farmers : కాయ ఎదిగిన తర్వాత నల్లతామరతో రంగు మారి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈసారి మిర్చి దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు చేసిన దాదాపు మూడు లక్షల ఎకరాల్లో మిర్చిపంటపై తెగుళ్ల ప్రభావం ఉంది. ఈ ఏడాది సాగు వ్యయం, కూలీల ఖర్చులు, విత్తనాల ధరలు పెరగడం వల్ల ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చయిందని పెట్టుబడి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెగుళ్ల నివారణకు నిర్దిష్ట పురుగు మందులు లేకపోవడంతో ఇతర పంటలకు వాడేవే రైతులు వాడుతున్నారు. పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు వ్యవసాయశాఖ అధికారులు పెద్దగా దిశానిర్దేశం చేయకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం అనేక రకాల పురుగు మందులను సిఫారసు చేస్తుండడంతో వాటిని వాడి మరింత నష్టపోతున్నారు. పంట వేసిన ప్రారంభంలో ఆకు ముడత వైరస్‌కు వాహకంగా ఉండే తెల్లదోమ, నవంబరు తర్వాత నల్లతామర(త్రిప్స్‌ వైరస్‌) వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతోందని మహబూబాబాద్‌ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త భాస్కర్‌ తెలిపారు.

పెట్టుబడి తిరిగొస్తుందనే నమ్మకం లేదు : రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఎకరం విస్తీర్ణంలో మిర్చి వేసినట్లు వరంగల్‌ జిల్లా అలంఖానిపేటకు చెందిన సముద్రాల శంకర్ తెలిపారు . అక్టోబరు వరకు పంట బాగుందని, అక్కణ్నుంచి పంటకు తెగుళ్లు మొదలయ్యాయని చెప్పారు. పంట రోజుకు కొంత దెబ్బతింటూ వచ్చిందని పేర్కొన్నారు. పంటలో చీడపీడల నివారణకు వివిధ రకాల పురుగుమందులు వాడినా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Chilli Crop in Telangana : తాము మూడెకరాల్లో మిర్చి సాగు చేశామని వరంగల్‌ జిల్లా మాదన్నపేటకు చెందిన పెసరు లావణ్యవీరస్వామి తెలిపింది . చీడపీడలు తీవ్రం కావడంతో ఒక్క ఎకరం మాత్రమే పంట చేతికొచ్చిందని వాపోయింది. నిరుడు 50 మంది కూలీలను పెట్టి పంట ఏరితే, ఇప్పుడు పది మందే సరిపోయారని పేర్కొంది. గతేడాది రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చిందని, ఈసారి పెట్టిన పెట్టుబడి రూ.2 లక్షలు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వివరించింది. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కోరింది.

కొల్లాపూర్ మామిడికి.. తామర పురుగు ముప్పు

పత్తి విత్తనాల నాణ్యత లోపం.. తెగుళ్లతో సతమతం.. చేతికి రాని పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.