ETV Bharat / state

తెలంగాణ, ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులపై కీలక ఒప్పందం

author img

By

Published : Jun 16, 2020, 12:21 PM IST

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు వీలుగా ఒప్పందానికి అడుగులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఇం‌ఛార్జీ ఎండీ సునీల్‌శర్మ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ల మధ్య ఫోన్‌లో మంతనాలు జరిగాయి.

officials-discuss-interstate-bus-service-telangana-to-andhra-pradesh
మీరు ఎన్ని నడిపితే మేమూ అన్నే.. ఆర్టీసీ ఎండీల మంతనాలు

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య అంత​ర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 'మీరు ఎంత నడిపితే మేమూ అంతే' అన్న విధానం ప్రకారం రెండు రాష్ట్రాలు సమాన సంఖ్యలో సర్వీసులు, కిలోమీటర్లు నడిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వీటికి సంబంధించి మూడు దశల్లో ఒప్పందం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ప్రతిపాదించింది.

ప్రస్తుతం డిమాండు బాగున్న మార్గాల్లో బస్సులు నడపాలన్నది వ్యూహంగా ఉంది. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన నూతన రవాణా చట్టంలో అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ఒప్పందం చేసుకోవాలంటే ఆయా మార్గాలను ముందుగా ప్రకటించాలి. ఆ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. అందుకు వీలుగా రెండు దశల్లో చర్చలకు అధికారులను పంపాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణను కోరింది.

త్వరలో అధికారుల స్థాయిలో జరిగే చర్చల్లో మార్గాల ముసాయిదా జాబితాను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఈ వివరాలను తెలుసుకునేందుకు ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రయత్నించగా తెలంగాణ ఆర్టీసీ ఇం‌ఛార్జీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ అందుబాటులోకి రాలేదు. తెలంగాణ ఆర్టీసీతో సమన్యాయం ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించామని.. ప్రసుత్తం ఏపీ ఎక్కువ కిలోమీటర్లు నడుపుతున్న మాట వాస్తవమేనని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. ఎక్కడి నుంచైనా అభ్యర్థనల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.