ETV Bharat / state

మహిళల వద్దకే స్క్రీనింగ్.. క్యాన్సర్ లక్షణాలుంటే అక్కడే బయాప్సీ

author img

By

Published : Jan 9, 2023, 9:38 AM IST

Mobile Lab
Mobile Lab

Mobile Lab for cancer screening in women : మహిళల్ల వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. మహిళల వద్దకే వెళ్లి పరీక్షలు చేయడమే కాకుండా.. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడిల్ బయాప్సీ చేస్తారు. క్యాన్సర్ నిర్ధారణ అయితే వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తారు.

Mobile Lab for cancer screening in women : మహిళల్లో వివిధ క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా వారి వద్దకే వెళ్లి స్క్రీనింగ్‌ చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. వివిధ పరీక్షలతోపాటు క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఫైన్‌ నీడిల్‌ ఆస్పిరేషన్‌ సైటోలజీ(ఎఫ్‌ఎన్‌ఏసీ) పరీక్ష కోసం శరీరం నుంచి నమూనాలు సేకరిస్తారు. దీనినే నీడిల్‌ బయాప్సీగా వ్యవహరిస్తారు. ఈ నమూనాల ద్వారా క్యాన్సర్‌ ఉందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. నిర్ధారణ అయితే వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు.

మూడు వందల మందికి పరీక్ష.. 60 మందిలో క్యాన్సర్‌.. మూడు జిల్లాల్లో దాదాపు 300 మంది మహిళలకు రొమ్ము, నోటి, సర్వైకల్‌ క్యాన్సర్లకు సంబంధించి ఎఫ్‌ఎన్‌ఏసీ టెస్టులు చేశారు. 60 మందిలో వివిధ రకాల క్యాన్సర్లు బయట పడ్డాయి. అందరికీ చికిత్స అందిస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఎంఎన్‌జే ఆసుపత్రి తగినంత మంది సిబ్బందితో మొబైల్‌ ల్యాబ్‌ను సిద్ధం చేసింది. ఈ బృందం గ్రేటర్‌లోని పలు బస్తీల్లో మహిళలకు స్క్రీనింగ్‌ నిర్వహించింది. తాజాగా సిద్దిపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పరీక్షలు చేసి అనుమానిత లక్షణాలున్నవారి నుంచి బయాప్సీకి నమూనాలు సేకరించారు. మిగిలిన జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత తెలిపారు.

35 ఏళ్లు దాటిన మహిళకు ఉచితంగా స్క్రీనింగ్‌ .. చాలామంది మహిళలు అనారోగ్య సమస్యను చెప్పుకోవటానికి సంకోచిస్తుంటారు. ఆర్థిక, సామాజిక, కుటుంబ కారణాలు ఇందుకు దోహదం చేస్తుంటాయి. దీంతో వ్యాధి ముదురుతున్నా పట్టించుకోరు. మొబైల్‌ ల్యాబ్‌ బృందాల వల్ల చాలామంది క్యాన్సర్‌ పరీక్షలకు ముందుకొచ్చే వీలుంటుంది. దీని ద్వారా 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఉచితంగా స్క్రీనింగ్‌ చేయనున్నారు.

cancer screening in women : మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళల్లో 40 శాతం మంది వరకు వీరే. తర్వాత వరుసలో సర్వైకల్‌, ఓరల్‌ క్యాన్సర్లు నమోదవుతున్నాయి.

ముందే గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. 80 శాతం మంది ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. ఇతర క్యాన్సర్ల బాధితులు కూడా 3, 4 దశలు దాటిన తర్వాతే సంప్రదిస్తున్నారు.

ముందే స్క్రీనింగ్‌ చేయడం వల్ల తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. మొబైల్‌ ల్యాబ్‌ ద్వారా సోనో మామోగ్రామ్‌, డిజిటల్‌ మామోగ్రామ్‌, ప్యాప్సిమీర్‌, ఎఫ్‌ఎన్‌ఏసీ పరీక్షలు నిర్వహించనున్నారు.

టెస్టుల తర్వాత క్యాన్సర్‌ ఉందని తేలితే ఆసుపత్రికి తరలించి మరిన్ని పరీక్షలు చేసి.. కీమో, రేడియేషన్‌ థెరపీలతో పాటు అవసరమైతే సర్జరీ చేయనున్నారు. టెస్టులతో సరిపెట్టకుండా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై మహిళలకు అవగాహన కల్పిస్తారు. ఏ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలో వివరించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.