ETV Bharat / state

MLA Jaggareddy: కేసీఆర్, జగన్​లపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By

Published : Jul 10, 2021, 4:45 PM IST

ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి హితవు పలికారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ జల వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్​, జగన్​లపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

mla jaggareddy
ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కృష్ణా జలాల వివాదంతో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌.. ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సింది పోయి.. సర్దుబాటు చేసుకోకుండా వివాదాన్ని పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే

కేసీఆర్, జగన్‌ ఇద్దరూ రాజకీయ ప్రయోజనాల కోసమే జలరగడను పెద్దది చేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి కష్టాలు పడుతుంటే.. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు జల వివాదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదంతా ఓ సమస్య అయితే తిరుపతిలో తెలంగాణ భక్తులు దర్శనానికి అనుమతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రం నుంచి అయినా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో వెళ్తే.. తిరుపతిలో దైవదర్శనానికి ఆయా భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు ఉందని ఎమ్మెల్యే అన్నారు. కానీ ఈ మధ్య తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు అనుమతి లేదని తిరుమల జేఈవో చెప్పారని.. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా అని ప్రశ్నించారు.

కృష్ణా జలాల వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో ఈ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కరోనా తీవ్రత అంశాన్ని పక్కదారి పట్టించేందుకే జల వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సామరస్యంగా పరిష్కరించుకోకుండా మీడియా ద్వారా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. -జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

షర్మిల పార్టీ వెనుక భాజపా హస్తం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు జగన్.. భాజపా పాలనపైన విమర్శలు చేయలేదని వెల్లడించారు.

జల వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: జగ్గారెడ్డి

ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.