ETV Bharat / state

సంబంధం లేకపోతే దర్యాప్తు ఎందుకు ఆపాలంటున్నారు: హరీశ్‌రావు

author img

By

Published : Nov 10, 2022, 6:10 PM IST

Updated : Nov 10, 2022, 6:58 PM IST

Ministers on Buying TRS MLAs Issue: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో భాజపాకు సంబంధం లేకపోతే సిట్‌ ఆపాలని ఎందుకు కోర్టుకు వెళ్లారని మంత్రులు హరీశ్​రావు, నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు. భాజపా నేతలు అడ్డంగా దొరికిపోయారని.. వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని ఆరోపించారు. పార్టీ పెద్దలకు సంబంధం లేకుంటే భాజపా నేతలు ఎందుకు భయపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల మద్దతు లేకున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను భాజపా కూలదోస్తోందని మండిపడ్డారు.

Ministers
Ministers

Ministers on Buying TRS MLAs Issue: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు అంశంపై ప్రగతిభవన్​లో మంత్రులు హరీశ్​రావు, నిరంజన్​రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా నేతలు అడ్డంగా దొరికిపోయారని.. వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తెలియదని భాజపా చెప్పిందన్న ఆయన.. మరి, సంబంధం లేని కేసులో ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. దీని వెనక ఉన్నది భాజపానే అన్న హరీశ్​.. అందుకే సిట్‌ విచారణ ఆపాలని కోరుతున్నారని ఆరోపించారు.

సంబంధం లేకపోతే దర్యాప్తు ఎందుకు ఆపాలంటున్నారు: మంత్రులు

'8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేసింది. తెలంగాణలో కొనుగోలుకు వచ్చి భాజపా అడ్డంగా దొరికింది. తెలంగాణ ప్రభుత్వం దొంగలను పట్టుకుని జైళ్లో పెట్టింది. ఈ కేసుకు సంబంధం లేకుంటే భాజపా ప్రధాన కార్యదర్శి కోర్టుకు ఎందుకు వెళ్లారు? దర్యాప్తు జరిగితే బండారం బయటపడుతుందని భాజపాకు భయం పట్టుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వీడియోల సంభాషణల్లో అర్థమైన వ్యక్తి రాహుల్‌గాంధీపై పోటీ చేసిన తుషార్‌. గవర్నర్‌ తమిళిసై తుషార్‌ పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదు.'-హరీశ్​ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఎమ్మెల్యేల కొనుగోలును సీబీఐకి ఇవ్వాలని భాజపా అంటోందని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులపై భాజపాకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. భాజపాకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సిట్‌ విచారణకు సహకరించాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్‌ వేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా పెద్దలు ఉన్నారని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.

సంబంధం లేకపోతే సిట్‌ ఆపాలని ఎందుకు కోర్టుకు వెళ్లారు..: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో భాజపాకు సంబంధం లేకపోతే సిట్‌ ఆపాలని ఎందుకు కోర్టుకు వెళ్లారని మంత్రి నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు. పార్టీ పెద్దలకు సంబంధం లేకుంటే భాజపా నేతలు ఎందుకు వణుకుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో భాజపా చర్యలతో సానుకూల ఫలితాలు సాధించిందని నిరంజన్​రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. తప్పుని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు

'ఉత్తమ విధానాలతోనే ప్రజాస్వామ్య ఫలితాలు అందుతాయి. మంచి పాలనను ప్రజలు హర్షిస్తేనే పార్టీల మనుగడ ఉంటుంది. ప్రజల మద్దతు లేకున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను భాజపా కూలదోస్తోంది. భాజపా.. తమదైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటోంది. పలు రాష్ట్రాల్లో మెజార్టీ లేకున్నా భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది.'-నిరంజన్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated :Nov 10, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.