ETV Bharat / state

'తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లే'

author img

By

Published : Jan 14, 2023, 3:49 PM IST

Ktr letter to Nirmala Sitharaman: తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే సమయం మోదీ ప్రభుత్వానికి ఆసన్నమైందని.. నిబద్ధతను చాటుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి రానున్న బడ్జెట్ ఉత్తమ సందర్భమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధులను ఈసారైనా కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడమంటే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు.

Ktr
Ktr

KTR Letter to Nirmala Sitharaman : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ఎనిమిదేళ్ల ప్రగతి ప్రస్థానంతోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని.. రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులకు జాతీయ ప్రాధాన్యత ఉందని తెలిపారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడమంటే దేశానికి సహకరించినట్లే అన్న కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు రానున్న కేంద్ర బడ్జెట్​లో తగిన నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

తెలంగాణ అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తోంది: తెలంగాణకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందన్న కేటీఆర్.. రాష్ట్రం అభివృద్ధి పట్ల తన నిబద్ధత చాటుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాబోయే బడ్జెట్ ఉత్తమ సందర్భమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను రానున్న కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వినూత్న పారిశ్రామిక విధానాలతో తెలంగాణ అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందన్న కేటీఆర్.. భారీ పెట్టుబడులకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్​టైల్ పార్కు, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్​గా హైదరాబాద్ ఫార్మాసిటీ లాంటి భారీ పారిశ్రామిక పార్కులు కేవలం తెలంగాణకే కాకుండా జాతీయ ప్రాధాన్యత కలిగి దేశ పారిశ్రామిక అభివృద్ధికి సైతం ఇతోధికంగా ఉపయోగపడతాయని కేటీఆర్ అన్నారు.

చివరి బడ్జెట్‌లోనైనా సానుకూలంగా స్పందించాలి: మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలు, విధానాలను కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ లాంటి అభివృద్ధికాముఖ రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలు బలంగా మారినప్పుడే దేశ ప్రగతి మరింత వేగంగా ముందుకు పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశ పారిశ్రామిక రంగంలో స్వల్ప కాలిక ప్రస్థానంతోనే అత్యంత కీలకంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి రానున్న కేంద్ర బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గత ఎనిమిదేళ్లుగా ప్రతి బడ్జెట్ సందర్భంగా ప్రోత్సాహకంగా దక్కాల్సిన నిధులపై అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినప్పటికీ.. కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ ఆర్థిక సాయం అందలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన చివరి బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడే పలు అంశాలపై సానుకూలంగా స్పందించాలని కోరారు.

పారిశ్రామిక కారిడార్లకు అవసరమైన నిధులు కేటాయించాలి: జహీరాబాద్ నిమ్జ్​లో మౌలిక సదుపాయాల కోసం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన కేటీఆర్.. రూ.9,500 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో కనీసం రూ.500 కోట్లు బడ్జెట్​లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్లకు అవసరమైన నిధులు కేటాయించాలని.. ఫార్మాసిటీ, నిమ్జ్​ను కలిపే రెండు నోడ్స్​కు ఖర్చయ్యే రూ.5 వేల కోట్లలో కనీసం సగం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్న ఆయన.. హుజూరాబాద్, జడ్చర్ల, గద్వాల్, కొత్తకోట నోడ్స్​ల వ్యయం రూ.5,000 కోట్లలో కనీసం రూ.1,500 కోట్లు బడ్జెట్​లో కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేయాలని, గ్యాస్ కేటాయింపులను వెంటనే ప్రకటించాలని కోరారు.

బడ్జెట్​లో కనీసం రూ.300 కోట్లు ప్రకటించాలి: బ్రౌన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల మంజూరు, అప్‌గ్రేడేషన్ చేపట్టాలన్న మంత్రి.. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ఫార్మా సిటీకి బడ్జెట్​లో నిధులు కేటాయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలని కేటీఆర్ కోరారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని.. బడ్జెట్​లో కనీసం రూ.300 కోట్లు ప్రకటించాలని కోరారు. టెక్స్‌టైల్ పార్క్, వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్‌లతో కూడిన మెగా పవర్‌లూమ్ క్లస్టర్​ను సిరిసిల్లకు మంజూరు చేయాలని.. పవర్ లూమ్​ల అప్​గ్రెడేషన్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు చేయాలన్న కేటీఆర్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.

చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని, హైదరాబాద్‌లో జాతీయ విమానయాన విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​కు ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలని.. విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో సెయిల్ ద్వారా సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.