ETV Bharat / state

రైతన్న చేసుకునే సంబురమే సంక్రాంతి: సీఎం కేసీఆర్​

author img

By

Published : Jan 14, 2023, 12:30 PM IST

KCR speech on the occasion of Sankranti festival: సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్​ తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ గొప్పదనం గురించి చెప్పారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల గురించి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​
ముఖ్యమంత్రి కేసీఆర్​

KCR speech on the occasion of Sankranti festival: తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో... యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన రోజే భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇళ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న చేసుకునే సంబురమే సంక్రాంతి అని ముఖ్యమంత్రి అన్నారు. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలిపే రోజే పండుగని సీఎం చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ పునరుజ్జీవ కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యపు రాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది తార్కాణమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక రైతు సంక్షేమ, వ్యవసాయరంగ అభివృద్ది కార్యాచరణతో రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉన్న కోటి 31 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం ఇప్పుడు రెండు కోట్లా 4 లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. దేశ వ్యవసాయ రంగంలో ఇదో విప్లవాత్మక పరిణామంగా కేసీఆర్ అభివర్ణించారు. ఒకనాడు దండగ అన్న వ్యవసాయం తెలంగాణలో నేడు పండుగ అయిందని అన్నారు. వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని తెలిపారు.

ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదు కొల్పుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యావత్ భారత ప్రజల సహకారంతో... సమష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్దికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండగను సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.