ETV Bharat / state

'కేంద్ర వివక్షపూరిత వైఖరికి ఇదే నిదర్శనం'.. కేంద్రమంత్రికి కేటీఆర్‌ లేఖ

author img

By

Published : Apr 16, 2022, 10:24 PM IST

'కేంద్ర వివక్షపూరిత వైఖరికి ఇదే నిదర్శనం'.. అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్‌ లేఖ
'కేంద్ర వివక్షపూరిత వైఖరికి ఇదే నిదర్శనం'.. అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్‌ లేఖ

KTR Letter to Central Minister: కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)ల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, పంజాబ్, ఝార్ఖండ్, కేరళలకు 22 ఎస్టీపీఐలను కేటాయించి... తెలంగాణకు ఒక్కటీ ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయమని ఆక్షేపించారు.

KTR Letter to Central Minister: సాఫ్ట్​వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం తాజాగా ప్రకటించిన ఎస్టీపీఐల్లో ఒక్కదాన్ని కూడా తెలంగాణకు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, పంజాబ్, ఝార్ఖండ్, కేరళలకు 22 ఎస్టీపీఐలను కేటాయించి తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం తీవ్రమైన అన్యాయని ఆక్షేపించారు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు లేఖ రాశారు. దేశ ఐటీ పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న తెలంగాణ.. జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటును గత కొన్నేళ్లుగా నమోదు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. 2014-15లో 57,258 కోట్లున్న ఐటీ ఎగుమతులు తాజాగా 1,45,522 కోట్లకు పెరిగాయని... ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6,28,000 పైగా పెరిగిందని అన్నారు.

ఐటీ హబ్​గా హైదరాబాద్.. భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ తెలంగాణ బెంగళూరును దాటుతోందని లేఖలో మంత్రి ప్రస్తావించారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విధానపర నిర్ణయాలు తీసుకుందని.. ఎలక్ట్రానిక్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డేటా సెంటర్ వంటి వివిధ రంగాలకు ప్రత్యేకమైన పాలసీలతో అభివృద్ధిని సాధిస్తున్న విషయాన్ని, ఆయా పాలసీలకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ప్రశంసలను మంత్రి కేటీఆర్ వివరించారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒక ప్రముఖమైన ఐటీ హబ్​గా హైదరాబాద్​ మారిందన్న ఆయన.. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్​తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలతో పాటు మౌలికవసతుల కల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయా పట్టణాల్లో ఏర్పాటు చేసిన ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను వినియోగించుకొని వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని కేంద్ర మంత్రికి కేటీఆర్ వివరించారు.

యువతకు తీరని ద్రోహం.. హైదరాబాద్​తో పాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యాన్ని పట్టించుకోకుండా.. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపుల్లో తెలంగాణను పరిగణలోకి తీసుకోకపోవడం, ఇక్కడి యువత ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని కేటీఆర్ ఆక్షేపించారు. ఇప్పటికే ఐటీఐఆర్ రద్దు చేసి తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు తీరని ద్రోహం చేశారన్న ఆయన.. ఐటీఐఆర్ పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసినా, అందరమూ పదేపదే విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.

కేంద్రం పునఃపరిశీలించాలి.. దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందని వివరించారు. ఈ ఆలోచన, విశాల దృక్పథాన్ని కేంద్రం అంగీకరించి, తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్ పట్టణాలకు సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.