ETV Bharat / state

సునీల్‌ కనుగోలు అంశం.. సీసీఎస్‌లో విచారణకు హాజరుకావడంలేదు: మల్లు రవి

author img

By

Published : Jan 12, 2023, 4:38 PM IST

Mallu Ravi
Mallu Ravi

Mallu Ravi on CCS Police Investigation: పార్టీ కార్యక్రమాల వల్ల సీసీఎస్​లో విచారణకు హాజరుకావడం లేదని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి పేర్కొన్నారు. మరో రోజు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు. సునీల్ కనుగోలు అంశంలో సీసీఎస్ పోలీసులు మల్లు రవికి ఇవాళ హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Mallu Ravi on CCS Police Investigation: హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరుకాలేనని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి వెల్లడించారు. పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. గత నవంబర్ 24న ఇనార్బిట్ మాల్ సమీపంలోని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సునీల్ కనుగోలు కార్యాలయం నుంచి రాజకీయ నాయకులను అవమానపర్చేటట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సైబర్ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంపై దాడులు కొనసాగుతున్న సమయంలో సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోలీసుల దాడులను అడ్డుకునేందుకు యత్నించారు. దాడుల సందర్భంగా ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని నోటిసులిచ్చి విడుదల చేశారు. ఆ కేసుకు సంబంధించి సునీల్ కనుగోలుకు ఇప్పటికే సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఇటీవల సీసీఎస్ విచారణకు కూడా అయన హాజరై వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాత పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని ఐదో నిందితుడిగా కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు అందజేశారు.

ఇవాళ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు స్పష్టం చేసిన ఆయన... సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడు పిలిచిన విచారణకు హాజరవుతానని వెల్లడించారు. చట్టప్రకారం సైబర్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు లోబడి ఉంటానని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని మల్లు రవి పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 14న పోలీసులు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సునీల్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సునీల్‌ కనుగోలుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌ 30న విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే అప్పటివరకు పోలీసులు అరెస్టు చేయవద్దని, 8న సునీల్‌ విచారణకు హాజరుకావాల్సిందేనని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు విచారణకు రావాల్సి ఉండగా, ప్రత్యేక అభ్యర్థనతో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ముందుకొచ్చారు. నేతలను కించపర్చటంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం, కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో లభ్యమైన సమాచారం మేరకు పోలీసులు సునీల్‌ను ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.