పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై.. కేఆర్ఎంబీకి ఏపీ లేఖ

author img

By

Published : Nov 17, 2022, 10:59 PM IST

AP Letter To KRMB
AP Letter To KRMB ()

AP Letter To KRMB: తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్​ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏపీ కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టునూ నిర్మించేందుకు వీల్లేదని ఏపీ స్పష్టం చేసింది. సదరు ప్రాజెక్టుపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని తెలియచేసేందుకు డీపీఆర్ ప్రతిని ఇవ్వాల్సిందిగా ఏపీ కేఆర్ఎంబీని కోరింది.

AP Letter To KRMB: తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్​ను ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈమేరకు ఏపీ ఈఎన్​సీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్​కు లేఖ రాసింది. విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడాన్ని ఆక్షేపించింది. గతంలోనూ కృష్ణాబేసిన్​లో తెలంగాణా నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టునూ నిర్మించేందుకు వీల్లేదని ఏపీ స్పష్టం చేసింది.

పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ ను కేఆర్ఎంబీకి సమర్పించినట్టుగా 2022 సెప్టెంబరు 3వ తేదీన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణా పేర్కొందని ఏపీ తెలియజేసింది. సదరు ప్రాజెక్టుపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని తెలియచేసేందుకు డీపీఆర్ ప్రతిని ఇవ్వాల్సిందిగా ఏపీ కేఆర్ఎంబీని కోరింది.

ఈ నెల 24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశం: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలశాయాల పర్యవేక్షక కమిటీ - ఆర్ఎంసీ చివరి సమావేశం ఈనెల 24న జరగనుంది. గతంలో నిర్ణయించిన మేరకు 24న కమిటీ ఆరో, చివరి సమావేశం నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చింది. జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ, వరదజలాలు, రూల్ కర్వ్స్ మార్గదర్శకాల ఖరారు కోసం ఆర్ఎంసీని బోర్డు ఏర్పాటు చేసింది.

గతంలో కమిటీ సమావేశమై కొన్ని అంశాలపై చర్చించింది. అయితే గత రెండు సమావేశాలకు రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు. దీంతో ఇప్పటి వరకు చేసిన కసరత్తు ఆధారంగా రూపొందించిన నివేదిక ఖరారు.. దానిపై సంతకాలు చేసేందుకు చివరి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎంసీ తెలిపింది. గతంలో అంగీకరించిన సిఫార్సులను కూడా సమావేశంలో సమీక్షించుకొని మరలా ఏకాభిప్రాయానికి రావచ్చని పేర్కొంది. ఒకవేళ చివరి సమావేశానికి ఏ రాష్ట్రానికి సంబంధించిన సభ్యులు రాకపోయినా, భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్ఎంసీ విఫలమైనట్లు భావించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇదే విషయాన్ని బోర్డుకు నివేదించాలని నిర్ణయించింది.

ఇవీ చదవండి: 12 గంటల పాటు .. పూరి జగన్నాథ్‌, ఛార్మిని ప్రశ్నించిన ఈడీ

రాజీవ్‌ హత్య కేసు దోషుల విడుదల.. సుప్రీంలో కేంద్రం పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.