సమాజంలో కుల వివక్షత, సామాజిక అసమానతలు, సాంఘిక వెనుకబాటుతనంలేని వారికి ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ల పెంపు... భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 9శాతం ఉన్న అగ్రవర్ణాల వారికి 10శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నోటికాడి ముద్దను గుంజుకుని అగ్రవర్ణాలకు ఇస్తున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అగ్రవర్ణాలకు తాము వ్యతిరేకం కాదని... దామాషా పద్ధతిన మా వాటా ఇచ్చాకే వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సత్తా చాటుతామని అన్నారు. ఫిబ్రవరి 25న వేలాది మందితో సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: 'తెరాస' ఓపిక నశిస్తే.. 'భాజపా' బయట తిరగలేదు: కేటీఆర్