ETV Bharat / state

ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు

author img

By

Published : Feb 28, 2020, 11:18 AM IST

వ్యక్తిగత వీడియోలను పంపిస్తూ మాజీ భర్త వేదింపులకు గురి చేస్తున్నాడని సైబర్ క్రైం పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. సినిమాల్లో స్టిల్ ఫోటోగ్రాఫర్​గా పనిచేసే యువకుడికి పదకొండేళ్ల క్రితం జూబ్లీహిల్స్​లో ఉంటున్న యువతితో వివాహమైంది. నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. మాజీ భార్య రెండో పెళ్లికి సిద్ధమైందన్న విషయాన్ని తెలుసుకున్న మాజీ భర్త ఆమె చరవాణికి అసభ్యకర వీడియోలు పంపించడం మొదలు పెట్టాడు.

lady compalint on her ex husbend
lady compalint on her ex husbend

సర్‌.. నాలుగు రోజుల నుంచి నా చరవాణికి పదుల సంఖ్యలో అసభ్యకరమైన చిత్రాలు... వీడియోలు వస్తున్నాయి... తొలగించే కొద్దీ వచ్చేస్తున్నాయ్‌.... వీటిని నా మాజీ భర్త పంపుతున్నాడు. గతంలో ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని ఫొటోలు వీడియోలు తీశాడు. మనం గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసేందుకు వీటిని పంపుతున్నాను.. అంటూ వాటికి వ్యాఖ్యానాలు జోడిస్తున్నాడు. పగలూ, రాత్రీ తేడా లేకుండా వాటిని పంపుతున్నాడు. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించేందుకు ఫోన్‌ చేస్తే.. స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. ఈ వేధింపులు భరించలేకపోతున్నాను.. అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించండి..

జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న ఒక యువతి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారితో రెండు రోజుల క్రితం ఆవేదనతో అన్న మాటలివి. తన మాజీ భర్త అసభ్య చిత్రాలు, వీడియోలను తనతో పాటు తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతానంటూ బెదిరిస్తున్నాడని చెప్పింది. అతడి బారి నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను అభ్యర్థించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం విడాకులు..

సినిమాల్లో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడికి పదకొండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో ఉంటున్న యువతితో పెళ్లయ్యింది. పెళ్లైన కొద్దినెలలకే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. భర్తతో సఖ్యతగా ఉంటున్నా సదరు యువతిని ఫొటోగ్రాఫర్‌ వేధించేవాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా.. రెండు కుటుంబాల్లోని పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చారు. కొద్దినెలలకే మళ్లీ వేధింపులు, చిత్రహింసలు మొదలయ్యాయి. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లి విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది.

కాబోయే భర్తకు...

నాలుగేళ్ల క్రితం కోర్టు విడాకులు మంజూరు చేసింది. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చేస్తున్నారు. గతనెల నిశ్చితార్థం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె మాజీ భర్త అప్పటి నుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడు. రెండో పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ హెచ్చరిస్తూ ఆమె వ్యక్తిగత చిత్రాలను చరవాణికి పంపుతున్నాడు. బాధితురాలి కాబోయే భర్త చరవాణి నంబర్‌ తీసుకుని అతడికి పంపించాడు. ఈ విషయాన్ని సదరు యువకుడు బాధితురాలికి చెప్పడంతో ఆమె మాజీ భర్తకు ఫోన్‌ చేసింది. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని రావడంతో వదిలేసింది. మళ్లీ మళ్లీ వీడియోలు, ఫొటోలు రావడంతో తల్లిదండ్రుల సూచనల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నర్సు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా..

విద్యార్థినులు, యువతులు, మహిళల చరవాణులు, ఈ-మెయిల్స్‌ వివరాలను తీసుకుంటున్న పోకిరీలు, సైబర్‌ నేరస్థులు తాజాగా మలక్‌పేటలో నివాసముంటున్న ఓ నర్సు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. అందులో అశ్లీల వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలను పోస్ట్‌ చేస్తున్నారు. ఆమె స్నేహితులు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. తాను ఆ వీడియోలు, చిత్రాలు అప్‌లోడ్‌ చేయలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ ఓ స్నేహితురాలు సూచించడంతో ఈ మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. వెంటనే తన పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తొలగించాలంటూ అభ్యర్థించింది.

80శాతం ఇలాంటి కేసులే..

తమకు వస్తున్న ఫిర్యాదుల్లో 80శాతం మంది తాము సామాజిక మాధ్యమాల వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ చెబుతున్నారని ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపారు. బాధితులు అపరిచితులు, స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటామంటే తిరస్కరించాలని, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు వారికి ఇవ్వకూడదని వివరించారు. బాధితులు కొన్ని జాగ్రత్తలు పాటించడం, వేగంగా తమకు ఫిర్యాదు చేస్తే నిందితులను పట్టుకుంటామన్నారు.

ఇదీ చూడండి: గోడకూలి నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.