ETV Bharat / state

యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడానికి కారణమదే: మంత్రి కేటీఆర్

author img

By

Published : Jun 27, 2022, 3:06 PM IST

ktr
మంత్రి కేటీఆర్

తెలంగాణలో జాతీయ సమావేశాలకు వస్తున్న భాజపా నేతలు.... రాష్ట్రానికి ఏమిచ్చారో రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా వేసిన నామినేషన్‌ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. యశ్వంత్‌ సిన్హాకు తెరాస సంపూర్ణ మద్దతిస్తోందన్న ఆయన... సిన్హాను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విపక్షాల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెరాస తరఫున ఎంపీ నామ నాగేశ్వరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేటీఆర్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ తరఫున సంఘీభావం తెలిపిన అనంతరం యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు కేటీఆర్‌ తెలిపారు.

యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చేలా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో అప్రజాస్వామికంగా అన్యాయాల పరంపర కొనసాగుతోందని మండిపడ్డారు. ఇప్పటివరకు దాదాపు 8 రాష్ట్రాల్లో భాజపాకు మెజారిటీ లేకపోయినా అక్కడి పరిస్థితులను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని భాజపా సద్వినియోగం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.

''రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాలపై ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి పార్టీ దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే భాజపా ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ విపక్షాలు బలపర్చిన అభ్యర్థిని బలపరిచాం. అయితే అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు.'' - కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

గిరిజనుల మీద భాజపాకు ప్రేమ ఉంటే.. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన అభ్యర్థికి మద్దతిస్తున్నామని భాజపా పదేపదే చెబుతోందని అన్నారు. తమ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గిరిజన జనాభా పెరిగిందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రం వద్దకు పంపించి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. భాజపాకు నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే ఈ పాటికే ఆమోదించాల్సిందని తెలిపారు. ఇప్పటివరకు చేయలేదు కదా.. చేస్తారో.. లేదో చెప్పడం లేదన్నారు.

''పార్లమెంట్‌లో మా పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినా ఎలాంటి స్పందన లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. ఈరోజు వరకు దానికి కూడా అతీగతీ లేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు.. అందులోనూ గిరిజన జనాభా ఎక్కువగా ఉండే మండలాలు.. ఇవన్నీ తీసుకెళ్లి పోలవరంలో ముంచిన నాడు గిరిజనుల మీద ప్రేమ ఏమైంది?కాబట్టి నోరుతో నవ్వుతూ.. నొసలుతో వెక్కిరించే భాజపా వైనం, వ్యవహారం తెలంగాణ, దేశంలోని గిరిజనులకు బాగా తెలుసు'' - కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడానికి కారణమదే: మంత్రి కేటీఆర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.