ETV Bharat / state

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

author img

By

Published : Oct 28, 2022, 10:44 PM IST

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

22:37 October 28

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపర్చారు. ప్రభుత్వాన్ని అస్తిరపర్చేందుకే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పేర్కొన్నారు. ప్రత్యేక ఆపరేషన్‌లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్‌ రికార్డర్లు వాడినట్టు కోర్టుకు తెలిపారు.

‘‘ఉదయం 11.30గంటలకు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనకు రూ.100 కోట్లు ఇస్తాం.. ప్రభుత్వాన్ని, తెరాసను అస్తిరపర్చాలని ఆఫర్‌ ఇచ్చారు. ఇది అనైతిక చర్య కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాం. పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో మీటింగ్‌ జరిగే హాల్‌లో నాలుగు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాం. రోహిత్‌రెడ్డి కుర్తా జేబులో రెండు వాయిస్‌ రికార్డర్లను పెట్టాం. ముందస్తు ప్రణాళిక ప్రకారం హాల్‌లో ఉన్న రహస్య కెమెరాలను మధ్యాహ్నం 3.05గంటలకు ఆన్‌ చేశాం. 3.10గంటలకు నిందితులతో కలిసి రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు వచ్చారు. ఆ తర్వాత సాయంత్రం 4.10గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్‌రెడ్డి, రేగా కాంతారావు వచ్చారు. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు.

ముందుగానే రోహిత్‌ రెడ్డికి ఒక సిగ్నల్‌ ఇవ్వాలని చెప్పాం. మీటింగ్‌ పూర్తికాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని పనిమనిషికి చెప్పాలి. అప్పుడు మేం లోపలికి వస్తామని చెప్పాం. కొబ్బరి నీళ్లు తీసుకురావాలని రోహిత్‌ చెప్పగానే లోపలికి వెళ్లాం. ముగ్గురు నిందితులు కూడా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ఆ తర్వాత వారి ఫోన్లు సీజ్‌ చేశాం. రహస్య కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు సీజ్‌ చేశాం. వాయిస్‌ రికార్డర్లు అక్కడే ఆన్‌ చేసి విన్నప్పుడు చాలా స్పష్టంగా.. సంభాషణలు మొత్తం రికార్డైనట్టు గుర్తించాం. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్లు ఇస్తామని వాయిస్‌ రికార్డర్లలో స్పష్టంగా నమోదైంది. కర్ణాటక, దిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా చేశామని రామచంద్రభారతి చెప్పిన విషయం కూడా రికార్డయింది. తుషార్‌కు రామచంద్రభారతి ఫోన్‌ చేసినట్టు కూడా ఉంది. తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్‌ బన్సల్‌కు రామచంద్రభారతి ఎస్‌ఎంఎస్‌ పంపారు. ఎస్‌ఎంఎస్‌ స్క్రీన్‌షాట్స్‌ కూడా ఉంది. రామచంద్రభారతి, నందు వాట్సాప్‌ సంభాషణల స్క్రీన్‌షాట్స్‌ మొత్తం ఉన్నాయి. మొత్తం 25 మంది నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంతోష్‌ భాజపా పేరుతో ఉన్న నంబర్‌కు రామచంద్రభారతి వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. కారులో ఉన్న నందు డైరీ కూడా స్వాధీనం చేసుకున్నాం. అందులో 50 మంది తెరాస, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డికి సహకరించేందుకు మాత్రమే ఫామ్‌హౌస్‌కు వచ్చారు’’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. పోలీసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ఆడియో వైరల్

ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ మీడియానే హంగామా చేస్తోంది: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.