ETV Bharat / state

'పోతిరెడ్డిపాడుపై ఏపీకి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరాం'

author img

By

Published : May 14, 2020, 6:34 AM IST

శ్రీశైలం జలాశయం దిగువ నుంచి భారీ మొత్తంలో నీటిని తరలిస్తే తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు ఎలా తీరతాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ప్రశ్నించారు. తాత్కాలిక కేటాయింపులపైనా తెలంగాణ న్యాయపోరాటం చేస్తోందని, రాష్ట్ర వాటా పెంచాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉన్న సాంకేతిక పరమైన అంశాలపై స్పష్టత వచ్చిందని, త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కొవిడ్ వల్ల ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయని.. పెద్ద ప్రాజెక్టులపై అంతగా లేకపోయినా చిన్న ప్రాజెక్టులపై ఆ ప్రభావం ఉందని రజత్ కుమార్ ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.

'పోతిరెడ్డిపాడుపై ఏపీకి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరాం'
'పోతిరెడ్డిపాడుపై ఏపీకి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరాం'

'పోతిరెడ్డిపాడుపై ఏపీకి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరాం'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రధాన అభ్యంతరాలు ఏమున్నాయి? కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏమని ఫిర్యాదు చేశారు?

శ్రీశైలం జలాశయం నుంచి అదనంగా నీరు తీసుకునేందుకు ఉత్తర్వు జారీ చేశారు. రూ.6,900కోట్లకు ప్రాజెక్టు ఉంది. అందులో 60శాతం నిధులతో రాయలసీమ ఎత్తిపోతల కొత్త పథకాన్ని చేపడుతున్నారు. శ్రీశైలం జలాశయంలో 805 అడుగుల నుంచి మూడు టీఎంసీల నీటిని తీసుకెళ్లాలని ప్రతిపాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండతో పాటు హైదరాబాద్​కు తాగునీరు ఇస్తున్నాం. నల్గొండలో నికర జలాలపై ఆధారపడి ఆయకట్టు ఉంది. నిర్మాణంలో ఉన్న పాలమూరు - రంగారెడ్డి ఇతర ప్రాజెక్టులపై కూడా దీని ప్రభావం పడుతుంది. తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కసారి ప్రాజెక్టు నిర్మించాక ఏమీ చేయలేం. వీటన్నింటి దృష్ట్యా ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరాం.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది.

తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. మా కేటాయింపుల నుంచే నీరు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ, ఎలా తీసుకెళ్తారు. సాంకేతికపరమైన అంశాలను కృష్ణా బోర్డు పరిశీలిస్తుంది. అపెక్స్ కౌన్సిల్, న్యాయపరంగా ముందుకెళ్లినా బోర్డు పరిశీలన కీలకమవుతుంది. అందుకే బోర్డుకు నివేదించాం.

కేటాయింపుల్లో నుంచే జలాలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అంటోంది. తెలంగాణకు నష్టం ఉండదు అంటున్నారు కదా..

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 512, 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. ఈ అంశంపై ఇప్పటికే పోరాడుతున్నాం. తెలంగాణకు కేటాయింపులు పెంచాలని కోరుతున్నాం. కేటాయింపుల అంశం న్యాయసమీక్ష ముందుంది. జలాశయం దిగువ నుంచి మూడు టీఎంసీలు తరలిస్తామంటున్నారు. దిగువన ఉండే జలాలను కేవలం తాగునీటికి మాత్రమే వినియోగిస్తున్నాం. ఏపీ పెద్దఎత్తున అంత మొత్తం నీటిని తరలిస్తే తెలంగాణ తాగునీటి, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుంది.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి ఏం చెబుతారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చాలా ముఖ్యమైనది. కరవు ప్రాంతానికి సాగునీటితో పాటు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు. అక్కడ కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి. పంప్ హౌస్​ భూగర్భంలో పెట్టాలా.. పైనా పెట్టాలా.. పెడితే ఎలా ఉంటుంది.. అంచనా వ్యయం లాంటి అంశాలు ఉన్నాయి. మొదటి జలాశయమైన నార్లాపూర్ వద్ద రాక్ ఫిల్ డ్యాం నిర్మించాలా... లేక మట్టికట్టతో చేయాలన్న విషయమై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతమైన చర్చలు జరుపుతున్నారు. స్పష్టత ఉంది. పాలమూరు - రంగారెడ్డి చాలా ముఖ్యమైన, ప్రాధాన్యమైన ప్రాజెక్టు. త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం.

రాష్ట్రంలో పెద్దఎత్తున నీటిపారుదల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. కొవిడ్ ప్రభావం ఏ మేరకు ఉంది.

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో 12వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేశాం. లేబర్ క్యాంపుల వద్ద వైద్యుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. పనికి వచ్చే వారికి మాస్కులు, శానిటైజర్లతో పాటు థర్మల్ స్కానర్​తో పరీక్షలు తప్పనిసరి చేశాం. ఎక్కడా కొవిడ్ కేసులు నమోదు కాలేదని గర్వంగా చెప్పవచ్చు. మల్లన్నసాగర్ వద్ద కార్మికులు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనిచేస్తున్నారు. రోజుకు రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరుగుతోంది. వలసకార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు వేయడం, ఇతర పరిణామాల వల్ల చాలా మంది సొంతూళ్లకు వెళ్తున్నారు. 30, 40శాతం వలసకార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లాలని చూస్తున్నారు. మేము కూడా అవసరానికి తగ్గట్టు అనుమతులు ఇస్తున్నాం. వలసకార్మికులు వెళ్లడం వల్ల యాభై శాతం పనులే సాగుతున్నాయి. చిన్న, చిన్న ప్రాజెక్టుల పనులపై ప్రభావం బాగా పడింది. గ్రామస్థులు బయటివారిని రానివ్వకపోవడం లాంటి సంఘటనలు ఉన్నాయి. రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ లాంటి పెద్దప్రాజెక్టుల పనులు మాత్రం కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.