ETV Bharat / state

నర్సులకు వందనం..మీ సేవలకు సలాం...

author img

By

Published : May 12, 2020, 11:40 AM IST

international-nurse-day-special-story
సేవకు.. మానవత్వానికి ప్రతీక నర్సులు

తెల్లని దుస్తుల్లో చల్లని తల్లి.. ముఖంలో చెరగని చిరునవ్వు.. అశ్వినీ దేవతల దూతగా భువిపైకి వచ్చిందేమో ఆమె! ‘రాత్రి నిద్ర పట్టిందా..’ అని రోగిని పలకరిస్తుంది.. ‘చెప్పినట్టు వింటే రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తాం’ అని నెమ్మదిగా హెచ్చరిస్తుంది! తోబుట్టువులా కుశలం కోరుతుంది.. పేరుకు నర్సే అయినా.. సిస్టర్‌ అంటారంతా! కరోనా కాలంలో ఎన్నడూ లేనంత బిజీ అయిపోయింది సిస్టర్‌! ప్రపంచమంతా భౌతిక దూరానికి దగ్గరైనా.. రోగులను అక్కున చేర్చుకుని అండగా నిలుస్తోంది. అందుకే ప్రధాని నుంచి సామాన్యుల వరకూ సాహో సహోదరి అని సిస్టర్‌ని కీర్తిస్తున్నారు..

ఎవరి వృత్తి ధర్మం వారిది. డాక్టర్‌ అన్నాక వైద్యం చేయాలి. టీచర్‌ అన్నాక పాఠాలు చెప్పాలి. సిస్టర్‌ అయితే.. వృత్తిధర్మం ఒక్కటే ఉంటే సరిపోదు. అంతకుమించిన ఓపిక కావాలి. ముక్కూమొహం తెలియని వారిని కూడా నావారు అనుకునేంత మంచితనం ఉండాలి. మామూలు రోజుల్లో సంగతి అటుంచితే.. ప్రపంచమంతా తల్లడం మల్లడం అవుతున్న ఈ తరుణంలో.. నర్సులు తమ ప్రాతను ఎవరూ ఊహించనంత గొప్పగా పోషిస్తున్నారు. వారి మాటలు ఔషధాల కన్నా ఎక్కువ గుణం చూపిస్తున్నాయి. కరోనా కౌగిట చిక్కి బయటపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ఇదే మాటన్నారు.

ఆస్పత్రిలో తనకు సేవలందించిన వైద్యులకు కృతజ్ఞతలు చెబుతూనే.. కంటికి రెప్పలా కాపాడిన నర్సమ్మ జెన్నీ మెక్జీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. తరచి చూస్తే ఇలాంటి ఉదంతాలు ఎన్నో! కుటుంబాలను వదిలిపెట్టి పనిలో నిమగ్నమవుతున్న సిస్టర్లు ఎందరో! కన్నబిడ్డలను కాదని.. కన్నీటితో విధులకు హాజరవుతున్న నర్సుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కర్ణాటకలోని బెల్గాంలో మిలాన్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిస్టర్‌ సుగంధ వీడియో అలాంటిదే! తనను కలవడానికి వచ్చిన కూతురు చేతులు చాచి పిలుస్తున్నా.. గుక్కపట్టి ఏడుస్తున్నా.. ఆస్పత్రిలోకి తిరిగి వెళ్లిన ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిందో! ఇలాంటి నర్సమ్మలు ఎందరో ఉన్నారు.అందరికీ నమస్సులు.

సిస్టర్‌ చిన్నమ్ములు కథ..

రోజూ పాజిటివ్‌ కేసులతో ప్రయాణం కొనసాగిస్తున్న ఎందరో నర్సులు.. ఇంటికి వెళ్లలేకపోతున్నారు. కడుపుతీపిని చంపుకొంటున్నారు. తమవల్ల బిడ్డలకు ఆపద ముంచుకొస్తుందని తల్లి వెనకడుగు వేయొచ్చు! అదే సమయంలో.. ప్రపంచానికి తమ అవసరం ఎంతో ఉందన్న బాధ్యత వారిని విధులవైపే మొగ్గుచూపేలా చేస్తోంది. విశాఖపట్నానికి చెందిన ఆదిరెడ్డి చిన్నమ్ములు కథ నర్సమ్మల పరిస్థితికి అద్దం పడుతోంది. ఆమెకు ఐదేళ్ల బాబు, ప్రత్యేక అవసరాలున్న ఓ పాప ఉన్నారు. కరోనా నేపథ్యంలో డిప్యుటేషన్‌పై విమ్స్‌లో విధులు చేయాల్సి వస్తోంది. ఆ పాపకు అన్నీ ఆమే! అమ్మను తప్ప ఎవరినీ పోల్చుకోలేదు. తల్లి కనిపించకపోతే బిక్కుబిక్కుమంటూ దిక్కులకేసి చూస్తోందా చిట్టితల్లి. కానీ, బిడ్డను పట్టించుకునే స్థితిలో ఈ అమ్మ లేదు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలనుకున్నారు. పాపను తల్లిగారింటికి పంపించారు. వీడియోకాల్స్‌ ద్వారా పిల్లలను పలకరిస్తున్నారు. ‘పిల్లలు గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు. కానీ, వారిని ఎందుకు పంపాల్సివచ్చిందో గుర్తు చేసుకొని స్థిమితపడతా! రోగులను కాపాడటమే మా లక్ష్యం. బాధితులంతా కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో కుంగిపోతుంటారు. వారికి మందులు ఇస్తూనే.. మానసిక స్థైర్యాన్ని నింపుతున్నామ’ని చెబుతున్నారు చిన్నమ్ములు.

ప్రధాని మెచ్చుకోలు..

పుణెలోని నాయుడు ఆస్పత్రిలో పదిహేనేళ్లుగా నర్సుగా సేవలు అందిస్తున్నారు ఛాయా జగ్తప్‌. కరోనా ముదిరిన మహారాష్ట్రలో.. సిస్టర్‌గా మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 12 గంటలు పనిలో నిమగ్నమవుతున్నారు. నెలన్నరగా కరోనా వార్డులోనే ఉంటున్నారు. ఓరోజు విధుల్లో ఉండగా ఆస్పత్రికి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ ఛాయకు ఇవ్వమన్నారు. ఫోన్‌ తీసుకున్నారామె. ‘మేడమ్‌ లైన్‌లో ఉండండి.. మీతో ప్రధానమంత్రి మాట్లాడతారు’ అన్నారు. ఆమెకేం అర్థం కాలేదు. అంతలోనే ‘నమస్కారం ఛాయా!’ అని పలకరించారు ప్రధాని మోదీ. కంగారుగానే ప్రతి నమస్కారం చెప్పారీమె. ‘మీరు చేస్తున్న కృషికి అభివందనాలు’ అంటూ ప్రధాని మెచ్చుకున్నారు. ఫోన్‌ పెట్టేశాక.. అక్కడ ఉన్నవారు చప్పట్లు కొట్టారు. మరుక్షణంలో ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోయింది. ఈ నర్సమ్మ మాత్రం వెంటనే వార్డులోకి వెళ్లిపోయారు. తన పని తాను చేసుకుపోయారు. ‘ప్రధాని అభినందించినప్పుడు కన్నా.. కరోనా బాధితులు పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్తున్నప్పుడే నాకు ఎక్కువ ఆనందం’ అంటారు ఛాయ. ఆయన ప్రశంసలు తనను మరింత శక్తిమంతురాలిని చేశాయంటారు.

ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.