ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు 'సీబీఐ'కే : హైకోర్టు

author img

By

Published : Feb 6, 2023, 10:46 AM IST

Updated : Feb 7, 2023, 6:29 AM IST

MLA CASE
MLA CASE

10:44 February 06

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

MLAs Poaching Case Updates: ఎన్నో మలుపులు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి చేరింది. కేసు దర్యాప్తునకు ఉన్న అడ్డంకులు.. హైకోర్టు ధర్మాసనం తీర్పుతో తొలిగిపోయాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. సిట్ దర్యాప్తు యథావిధిగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను సీజే ధర్మాసనం కొట్టేసింది. ఈ పిటిషన్‌కు అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నేర తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసిన అంశాలపై సీబీఐ దృష్టి: దీంతో కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. మెయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు చేసిన దర్యాప్తు.. రద్దు చేస్తున్నట్లు సింగిల్ బెంచ్ గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్‌హౌజ్‌లో చోటు చేసుకున్న ఘటనల గురించి.. సీబీఐ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసిన అంశాలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.

వివిధ అంశాల గురించి సీబీఐ అధికారుల ఆరా: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మెయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల గురించి సీబీఐ అధికారులు ఆరా తీయనున్నారు. అంతే కాకుండా కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో.. కీలకమైన వీడియోలు బయటికి వెళ్లడాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ తప్పు పట్టింది. నేరానికి సంబంధించిన వీడియోలు సీఎంకు ఎలా చేరాయనన్న దానికి.. పోలీసులు, ఫిర్యాదుదారులు సరైన సమాధానం చెప్పలేదని హైకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంపైనా సీబీఐ అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంది.

వివాదం అంతా కోర్టుల చుట్టూనే: ఎమ్మెల్యేలకు ఎర కేసు నమోదైనప్పటి నుంచి.. వివాదం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్ 26న మెయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నాంపల్లి అనిశా ప్రత్యేక కోర్టులో ముగ్గురు నిందితులైన రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను ప్రవేశ పెట్టారు. కోర్టు మాత్రం నిందితుల రిమాండ్‌కు అంగీకరించలేదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ను నమోదు చేశారని.. దీన్ని దర్యాప్తు చేసే పరిధి మెయినాబాద్ పోలీసులకు లేదంటూ అనిశా కోర్టు తిరస్కరించింది.

దీంతో పోలీసులు హైకోర్టుకు వెళ్లి న్యాయమూర్తి ఆదేశాలతో ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తునకు బదిలీ చేసింది. సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మాత్రం సిట్ దర్యాప్తుపై స్టే విధించడానికి నిరాకరిస్తూ.. హైకోర్టు దీని విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తిరిగి హైకోర్టులో సిట్ దర్యాప్తుపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగిన తర్వాత.. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పునిచ్చారు.

ఆ సమయంలో పలు మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్, తుషార్ కపూర్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ నోటీసులివ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 41ఏ సీఆర్పీసీ నోటీసులపై కోర్టు స్టేలు విధిస్తూ వచ్చింది. బీఎల్ సంతోష్, తుషార్‌లను నిందితులుగా చేరుస్తూ మెయినాబాద్ పోలీసులు.. నాంపల్లి అనిశా ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన మెమోలను సైతం కోర్టు తిరస్కరించింది.

సీజే ధర్మాసనంలోనూ పోలీసులకు చుక్కెదురు: హైకోర్టు సింగిల్ బెంచ్‌లో ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ధర్మాసనంలో అప్పీల్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత సీజే ధర్మాసనంలోనూ పోలీసులకు చుక్కెదురైంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీసులున్నారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలును రెండు వారాలపాటు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోరినా.. దానికి ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని విమర్శించారు. విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంను కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తమను ఇబ్బంది పెడితే సహించేది లేదని గువ్వల బాలరాజు హెచ్చరించారు.

ఇవీ చదవండి: రాష్ట్ర సర్కారు ప్రగతి ప్రస్థానానికి కొనసాగింపుగా.. మరోమారు భారీ బడ్జెట్‌

60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే..

Last Updated :Feb 7, 2023, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.