ETV Bharat / state

పాటలు పాడుకునే స్థితి నుంచి ప్రజలు నీరాజనాలు పట్టేదాకా.. వైద్యశాఖలో ఎన్నోమార్పులు

author img

By

Published : Jun 2, 2022, 6:24 AM IST

health
health

Telangana Health Facilities: ఒకప్పుడు సర్కారు దవాఖానాకు రాను అంటూ పాటలు పాడుకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రభుత్వ వైద్యులకు ప్రజలు నీరాజనాలు పట్టేలా రాష్ట్రంలో సర్కారు ఆస్పత్రులు మెరుగయ్యాయి. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ వైద్యంలో అనేక మార్పులు చేస్తూ వస్తోంది. మంచి వైద్యం అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ వృద్ధిపై ప్రత్యేక కథనం.

పాటలు పాడుకునే స్థితి నుంచి ప్రజలు నీరాజనాలు పట్టేదాకా.. వైద్యశాఖలో ఎన్నోమార్పులు

Telangana Health Facilities: రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయింది. కొత్త రాష్ట్రంలో వైద్యారోగ్య సేవలు మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గడచిన ఎనిమిదేళ్లలో సర్కారు ఆస్పత్రుల పనితీరులో మార్పులు చేయటంతోపాటు ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పెంచేలా కృషి చేసింది. ప్రస్తుతం ప్రజారోగ్యంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవటం గమనార్హం. 2017లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెంచే లక్ష్యంతో కేసీఆర్ కిట్‌ని ప్రారంభించిన సర్కారు... గత 8 ఏళ్లలో సుమారు 13లక్షల 29వేల మందికిపైగా కిట్‌ను అందజేసింది. 2018లో జీహెచ్​ఎంసీ పరిధిలో బస్తీ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా ప్రశంసించింది. వైద్య పరీక్షల పేరుతో పేదల జేబుకు చిల్లు పడుతుందని గుర్తించిన ప్రభుత్వం... టీ-డయాగ్నోస్టిక్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా సుమారు 60 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తోంది. కిడ్నీ రోగుల కోసం ఉచిత డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 43కి పెంచిన తెలంగాణ సర్కారు... దేశంలోనే మొట్టమొదటి సారిగా సింగిల్ యూజ్ డయలైజర్, ట్యూబింగ్​ని అందుబాటులోకి తెచ్చింది.

ప్రజలకు మెరుగైన సేవలు: గర్భవతులను యాంటీనేటల్ చెకప్‌లు, ప్రసవానంతరం ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి పేరుతో ప్రత్యేక వాహనాలు, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ కారణంగా సర్కారు వైద్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను... 1,400 ఉన్న ఐసీయూ పడకలను 26 వేల 132కి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 24 లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. బీపీ, షుగర్ రోగులకు ఇంటికే మందులను అందించే కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టింది. కంటి వెలుగు, హెల్త్ ప్రొఫైల్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది.

జిల్లాకో మెడికల్ కాలేజీ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోన్న సర్కారు... జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా... ఇప్పటికే 4 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చింది. మరో 8 నిర్మాణ దశలో ఉన్నాయి. 700 ఎంబీబీఎస్ సీట్లను 1,640కి పెంచగా... త్వరలో మరో 1,200 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నలుమూలల టిమ్స్ పేరుతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

ప్రసవాలపెంపుపై: ఆస్పత్రుల్లో ప్రసవాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు... గత నాలుగేళ్లలో ఇనిస్టిట్యూషనల్ డెలివరీలను 97 శాతానికి పెంచింది. ఇక చిన్నారుల ఇమ్యునైజేషన్‌లోనూ ముందంజలో ఉన్న రాష్ట్రం 96 శాతం మంది పిల్లలకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ని అందిస్తోంది. జాతీయ ప్రసవ మరణాలు రేట్ 103 ఉండగా రాష్ట్రంలో అది కేవలం 56. ఇక శిశు మరణాలు, ఐదు రోజుల్లోపు శిశుమరణాలు, 2వారాల్లోపు శిశు మరణాలను తగ్గించి జాతీయ సగటుతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. ఇక ఆరోగ్యశాఖ నిధులను సైతం రూ. 11 వేల 440 కోట్లకు పెంచింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.

అపవాదు: పిల్లల ఇమ్యునైజేషన్, బస్తీ దవాఖానాలు సహా అనేక అంశాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానాన ఉండటం గర్వించదగ్గ విషయమే అయినా... రాష్ట్రంలో సీ సెక్షన్ సర్జరీలలోనూ మొదటిస్థానంలో నిలిచి అపవాదు మూట గట్టుకుంది. ఇక సిజేరియన్‌లను తగ్గించేందుకు ప్రణాళిక రచించిన సర్కారు... వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులకు సీ సెక్షన్‌లు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.