అవగాహన, అప్రమత్తతే రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడేసే మార్గమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వెబినార్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో పింక్ వాక్కు బదులు, పింక్ టాక్ను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ నిర్వాహకులను గవర్నర్ అభినందించారు.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వీక్లో భాగంగా ప్రభుత్వ, చారిత్రక భవనాలు పింక్ వర్ణాన్ని సంతరించుకోవటం మంచి పరిణామమని గవర్నర్ పేర్కొన్నారు. అక్టోబర్ మాసాంతంలోగా రాజ్భవన్ సైతం పింక్ వర్ణం సంతరించుకుని.. పింక్ వీక్ కాంపెయిన్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాంపెయిన్లో భాగంగా గవర్నర్ పింక్ మాస్క్, దుస్తులు ధరించి మద్దతు తెలిపారు.
దేశంలో యువ క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహనను పెంచే ఏబీసీ బ్రెస్ట్ క్యాన్సర్ యాప్ను కళాశాల యువత డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా తల్లి పేరిట క్యాన్సర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి, బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పలువురికి చికిత్స అందిస్తోన్న ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘురామ్, కిమ్స్ ఎండి భాస్కర్ రావు, ఫౌండేషన్కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తోన్న జయేశ్రంజన్లను గవర్నర్ అభినందించారు.
60 శాతం మంది బాధితులు లేట్ డయాగ్నోసిస్తో మృత్యువాత పడుతున్నారని.. ఎర్లీ డయాగ్నోసెస్ ఒక్కటే ఈ మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాత రావు అభిప్రాయపడ్డారు. పట్టణ, నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అవగాహన, స్క్రీనింగ్ అవసరమని తెలిపారు. వచ్చే దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు ఆడపడుచులకు కొత్త చీరలకు బదులు.. బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ మామోగ్రామ్ను కానుకగా ఇవ్వాలని ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ఉషాలక్ష్మిని కోరారు.