ETV Bharat / state

Gopala Mitra Telangana : 'గోపాలమిత్ర'ల గోడు.. పశుసంవర్థక శాఖలో విలీనం చేయాలని వేడుకోలు

author img

By

Published : Aug 9, 2023, 2:13 PM IST

Gopala Mithra issues
Gopala Mitra issues in Telangana

Gopala Mitra Telangana : మూగజీవాలకు సత్వరం వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థ గోడు పట్టడం లేదు. మారుమూల పల్లెల్లో పశువైద్యశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పాడి రైతుల ఇంటి ముంగిట్లో అత్యవసర సేవలు అందిస్తున్న.. గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం చెమటోడ్చి శ్రమించినా నెలకు రూ.11 వేల 50 రూపాయలే చెల్లిస్తుండటంతో ఆ గౌరవ వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదంటున్నారు. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా తమకు కనీసం వేతనం చెల్లించడం సహా.. పశుసంవర్థక శాఖలో విలీనం చేయాలని గోపాలమిత్రలు డిమాండ్ చేస్తున్నారు

Gopala Mitra issues in Telangana కష్టాల సుడిగుండంలో మూగజీవాలకు వైద్యం అందిస్తున్నాం... మమ్మల్ని ఆదుకునేదెవరు..?

Gopala Mitra Telangana : రాష్ట్రంలో పాడి రంగం, రైతుల అభ్యున్నతి కోసం తమ సేవలందిస్తున్న గోపాలమిత్రలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోన్నారు. వ్యవసాయ అనుబంధంగా పాడి రంగంలో మేలు జాతి ఆవులు, గేదెల పునరుత్పత్తి, పాల ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు లక్ష్యంగా ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థకు.. ఆశించిన సహకారం అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 23 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పాడి రైతులకు సేవలందించడంతోపాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్లో సైతం గోపాలమిత్రులు భాగస్వామ్యం అవుతున్నారు.

Gopala Mitra Issues in Telangana : నిజానికి గోపాలమిత్రుల ముఖ్య విధి.. పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించడ మాత్రమే. కానీ పశుసంవర్థక శాఖ నిర్వహిస్తున్న పశు గర్భకోశ చికిత్స వైద్య శిబిరాలు, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ.. పశుగ్రాసాల పెంపకం, పశువుల్లో టీకాల లాంటి అన్నిరకాల కార్యక్రమాల్లో కూడా పనిచేస్తూ సేవలందిస్తున్నారు. నెల వారీ లక్ష్యాల్లో ఒక్కోసారి వెనుకబడి గౌరవ వేతనాల చెల్లింపుల్లోనూ కోతలు పెడుతుండటంతో.. బతుకులు దినదిన గండంగా మారాయని గోపాలమిత్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. విజ్ఞప్తి చేస్తున్నారు.

పాడి రైతుకు ఏదీ వెన్నుదన్ను?

"సొంత రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ జీతాలు పెంచారు. కానీ ప్రస్తుతం ఉన్న ధరలకు వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవడం లేదు. గేదెలకు, ఆవులకు ఏ రాత్రి ఏం జరిగినా మాకు సమాచారం రాగానే వెళ్లి మేము సేవలు అందిస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని వేడుకుంటున్నాం." - గోపాల మిత్ర ఉద్యోగులు

ఏ రాత్రి అయినా సేవలు అందిస్తున్నాము : రోడ్డు సౌకర్యం లేని పల్లెలకు వెళ్లి సేవలందిస్తున్న నేపథ్యంలో.. కనీస వేతనం ఇచ్చి పశుగణాభివృద్ధి సంస్థను పశుసంవర్థక శాఖలో విలీనం చేయాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఆఫీసు సబార్డినేట్స్‌గా పశుసంవర్థక శాఖలో 50 శాతం కోటా ఇచ్చి నియమించడం.. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని గోపాలమిత్రలు కోరారు. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం.. తమకు వర్తింపజేయాలని గోపాలమిత్రలు విజ్ఞప్తి స్తున్నారు

"ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోపాల మిత్ర ఉద్యోగుల సేవలను గుర్తించి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత మేరకు మార్కులు కలుపుతున్నారు. తెలంగాణలో కూడా అటువంటి అవకాశం ఇస్తే బాగుటుంది. మమ్మల్ని ఓఎస్ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు వృత్తి నైపుణ్యం ఉంది. మేం చదవగలం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం." - శ్రీనివాస్‌, అధ్యక్షుడు రాష్ట్ర గోపాల మిత్రుల సంఘం రాష్ట్ర కమిటీ

శుభవార్త: ఒక్కో రైతుకు నేరుగా రూ.1.60 లక్షలు!

రాష్ట్రంలో పాడి రైతుల ఇంటి ముంగిట కృత్రిమ గర్భధారణ సేవలు అందించేందుకు 1807 మంది గోపాలమిత్రలు, సూపర్‌వైజర్లు, పశుమిత్రులు, మైత్రిలు పనిచేస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడక ముందు పశువుల్లో బ్రీడింగ్ సేవలు అందించేందుకు కేవలం కరీంనగర్‌లో ఒక వీర్య నాళికల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్‌లో ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రానికి ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రం లభించింది.

రంగారెడ్డి జిల్లా కంసంపల్లిలో మరొక మెగా వీర్య నాళికల ఉత్పత్తి కేంద్రం స్థాపించారు. 2014 ముందుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడే రాష్ట్రం.. మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వీర్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. వీటన్నింటికీ గోపాలమిత్రల సహకారం ఎంతో ఉంది. చిన్న, సన్నకారు, పెద్ద రైతుల నుంచి... గోపాలమిత్రలపై ఆదరణ వ్యక్తం అవుతోంది.

ఒక దేశవాళీ గేదె ముర్రా జాతిగా మారడానికి... 10 నుంచి 12 ఏళ్లు పడుతుంది. ఇప్పుడు 60 శాతం పశువులు ఇలా మారడంలో గోపాలమిత్రల సేవలు దోహదం చేస్తున్నాయి. వేతనాల చెల్లింపుల్లో కోతలు విధిస్తున్నా భరిస్తున్న దృష్ట్యా... సీఎం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Sadar Festival: సదర్‌ వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. భారీ దున్నలు కనువిందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.