ETV Bharat / state

శేషన్నను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్

author img

By

Published : Oct 10, 2022, 3:44 PM IST

గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని గోల్కొండ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల శేషన్న చేసిన నేరాల గురించి తెలుసుకోవాల్సి ఉందని కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటషన్​లో కోరారు.

Gangster Nayeem follower sheshanna
Gangster Nayeem follower sheshanna

మాజీ మావోయిస్టు, నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని గోల్కొండ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నయీం అనుచరుడిగా వ్యవహరించిన శేషన్న 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అందులో తెలిపారు. ఇటీవల హైదరాబాద్​లో పలు బెదిరింపుల కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల శేషన్న చేసిన నేరాల గురించి తెలుసుకోవాల్సి ఉందని కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్​లో కోరారు. దీనిపై నాంపల్లి కోర్టు వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎవరి శేషన్న?: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన శేషన్న పదో తరగతి చదువుతుండగానే నక్సలైట్‌ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1993లో సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో టాడా కేసులో అరెస్టయ్యాడు. అనంతరం మాజీ ఐపీఎస్‌ కేఎస్‌ వ్యాస్‌ హత్య కేసులో పీటీవారెంట్‌పై పోలీసులు ఆయనను జైలుకు పంపగా.. అక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీంతో శేషన్నకు అనుబంధం పెరిగింది.

నక్సల్‌ ఉద్యమంలో ఉండగానే నయీంతో పరిచయమున్నా, జైలు అనుంబంధం వారిని మరింత దగ్గర చేసింది. బెయిల్‌పై బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి పెద్దఎత్తున దందాలు చేశారు. అచ్చంపేటలో 2004లో రాములు, ఉట్కూర్‌లో 2005లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకాచారి, హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలో 2011లో మాజీ నక్సలైట్‌ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో శ్రీనివాస్‌రావు, 2014లో నల్గొండ పట్టణంలో కోనాపురం రాములు హత్య కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు.

ఈ హత్యలు చాలావరకు నయీం ప్రోద్బలంతోనే జరిగాయి. ఆయుధ చట్టం కింద శేషన్నపై మరో 3 కేసులు నమోదయ్యాయి. నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో శేషన్న సైతం పోలీసుల పరిశీలనలో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో శేషన్న అడవుల్లో, పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నాడనే వాదన వినిపించింది. అప్పటినుంచి దందాలకు దూరంగా ఉండటంతో పోలీసులు అతడిపై పెద్దగా దృష్టి సారించలేదు.

ఇటీవల హైదరాబాద్‌ హుమాయూన్‌నగర్‌కు చెందిన ఓ మాజీ రౌడీషీటర్‌ను బెదిరించాలంటూ శేషన్న అదే ప్రాంతంలోని ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన అబ్దుల్లాకు తుపాకీ ఇచ్చాడు. ఈ విషయం పోలీసులకు ఉప్పందడంతో అబ్దుల్లా ఇంట్లో సోదా చేసి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శేషన్న కదలికలపై నిఘా ఉంచి శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: పోలీసుల అదుపులో గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు.. సెటిల్​మెంట్​ చేస్తుండగా..!

రేపు యూపీకి సీఎం కేసీఆర్

పద్మనాభ ఆలయంలోని శాకాహార మొసలి 'బబియా' కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.