ETV Bharat / state

Heart disease: గుండె జారిపోతోంది...పేదోళ్లకు గుండెజబ్బు వస్తే దిక్కేది?

author img

By

Published : Jun 7, 2021, 5:14 AM IST

క్యాథ్‌ల్యాబ్‌(Cath lab)లో కేవలం గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించడం, వాటిని తొలగించడమే కాదు.. చాలా రకాల ఉపయోగకరమైన చికిత్సలను చేస్తుంటారు. ఉదాహరణకు గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్‌ మేకర్‌ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరినప్పుడు దాన్ని తొలగించే చికిత్స కూడా క్యాథ్‌ల్యాబ్‌లోనే చేయాలి. గుండె రక్తనాళాల్లోనే కాదు.. స్టెంట్లను చేతుల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా వేయాల్సి వస్తుంది. క్లోమగ్రంధిలోనూ కొన్నిసార్లు స్టెంట్లు వేయాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లోనూ క్యాథ్‌ల్యాబ్‌ను ఉపయోగిస్తారు.

heart attack
గుండెజబ్బు

పేదోళ్లకు గుండెజబ్బు (Heart disease) వస్తే ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో దిక్కులేని పరిస్థితి నెలకొంది. నిమ్స్‌ను మినహాయిస్తే రాష్ట్రం మొత్తమ్మీద గుండెజబ్బులొస్తే క్యాథ్‌ ల్యాబ్‌ సౌకర్యమున్న ప్రభుత్వ ఆసుపత్రులు రెండే రెండు. ఒకటి ఉస్మానియా, రెండోది గాంధీ ఆసుపత్రి. ఇవి మినహా యాంజియోగ్రామ్‌లు, యాంజియోప్లాస్టీలు నిర్వహించే ఆసుపత్రులు మరెక్కడా లేవు. అయితే ఈ రెండింటిలో ప్రస్తుతం క్యాథ్‌ ల్యాబ్‌(Cath lab) సేవలు అందుబాటులో లేవు.

గత ఏడాదిగా ఉస్మానియా క్యాథ్‌ ల్యాబ్‌ (Cath lab) మరమ్మతులకు గురై మూలనపడగా.. కొవిడ్‌ కేంద్రంగా మారిన గాంధీ ఆసుపత్రిలోనూ ఏడాదిన్నరగా అక్కరకు రావట్లేదు. ఉస్మానియాలో కొత్త క్యాథ్‌ల్యాబ్‌ కోసం ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. అయినా కూడా పరికరాల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో.. ఆ ప్రభావం రోగులపై పడుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు నిమ్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల భారమంతా నిమ్స్‌పైనే పడుతుండడంతో రోగులు చికిత్స కోసం వారాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రోగులు అర్థాంతరంగా కన్నుమూస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.

ఏడాదిగా అతీగతీ లేదు...

ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి కార్డియాలజీ విభాగం కింద రోజూ సుమారు 300 మంది వస్తుంటారు. ఇక్కడ రోజుకు 10-15 వరకూ యాంజియోగ్రామ్‌లు, 7-10 వరకూ యాంజియోప్లాస్టీలు జరుగుతుంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కొవిడ్‌ కాలంలోనూ 160 మందికి గుండె చికిత్సలు క్యాథ్‌ల్యాబ్‌(Cath lab)లో చేశారు. వాటిలో 99 యాంజియోగ్రామ్‌లు ఉండగా.. 25 సింగిల్‌ స్టెంట్‌ యాంజియోప్లాస్టీలు, 19 డబుల్‌ స్టెంట్‌ యాంజియోప్లాస్టీలు, 3 మూడు స్టెంట్ల యాంజియోప్లాస్టీలతో పాటు ఇతరత్రా చికిత్సలు ఇక్కడ జరిగాయి. అంత కీలకమైన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు ఇప్పుడు నిలిచిపోయాయి. తయారు చేసిన కంపెనీ ప్రమాణాల ప్రకారం 2006లో నెలకొల్పిన ఈ క్యాథ్‌ల్యాబ్‌ 2016 వరకే పనిచేస్తుంది. కానీ దీనికి మరమ్మతులు చేస్తూ 2019 వరకూ లాక్కొచ్చారు.

‘ఇక ఏం చేసినా ఈ పరికరం పనిచేయద’ని ఉత్పత్తి సంస్థ మెకానిక్‌లే చేతులెత్తేశారు. అయినా దానికి మరమ్మతులు చేసి గత ఏడాది మే వరకూ నడిపారు. అప్పటికే పని భారం పెరిగిన ఆ పరికరం పూర్తిగా మొరాయించడంతో అప్పట్నించి క్యాథ్‌ల్యాబ్‌ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రభుత్వం స్పందించి.. 2020 డిసెంబరులోనే రూ.7 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయినా కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. నేటికీ కొత్త క్యాథ్‌ల్యాబ్‌కు ఉస్మానియా నోచుకోలేదు.

పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం

ఏడాదిన్నరగా గాంధీలో క్యాథ్‌ల్యాబ్‌(Cath lab) మూతపడడంతో పాటు మొత్తంగా కార్డియాలజీ విభాగమే పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఇక్కడున్న తొమ్మిది మంది పీజీ సూపర్‌ స్పెషాలిటీ వైద్యవిద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. మూడేళ్ల పీజీ వైద్యవిద్యలో ఈసీజీ, 2డి ఎకో మొదలుకొని క్యాథ్‌ల్యాబ్‌లో సేవల వరకూ ప్రతిదీ అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సిందే. గతేడాది కార్డియాలజీ తుది సంవత్సరం విద్యార్థులు కొవిడ్‌ కారణంగా ఇవేమీ నేర్చుకోకుండానే వైద్యవిద్యను ముగించారు. ఉస్మానియాలోనూ 21 మంది పీజీ కార్డియాలజీ విద్యార్థులున్నారు. గత ఏడాదిగా వీరికి కూడా క్యాథ్‌ల్యాబ్‌ శిక్షణ కరవైంది.

అతి ముఖ్యమైన చికిత్సలో శిక్షణ లేకుండా కార్డియాలజీ వైద్యులు కళాశాల వదిలి బయటకు వెళ్లడం మంచిది కాదు. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల ప్రకారం.. క్యాథ్‌ల్యాబ్‌ శిక్షణ అందుబాటులో లేకపోతే.. బోధనాసుపత్రి పీజీ సీట్లను కూడా కోల్పోయే ప్రమాదముంది. ఇలాగైతే ఈ రెండు చోట్ల కార్డియాలజీ సీట్లకు ఎసరు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిమ్స్‌పై మోయలేని భారం...

గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌(Cath lab) ఉన్నా కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చడంతో 2020 మార్చి నుంచి ఇక్కడి రోగులను కూడా ఉస్మానియాకు పంపించేవారు. మే 2020 నుంచి ఉస్మానియాలోనూ క్యాథ్‌ల్యాబ్‌ పని చేయకపోవడంతో.. గాంధీకి వచ్చిన వారినీ నిమ్స్‌కు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఉస్మానియాకు తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ నుంచి వారానికి కనీసం ముగ్గురు, నలుగురు వస్తుంటారు. వీరికి అదనంగా 24 స్టెమీ ప్రోగ్రాం అమలు చేసే కేంద్రాల నుంచి సుమారు 360 మంది రోగులు కూడా ఉస్మానియాకు చికిత్స కోసం వచ్చారు. వీరందరినీ నిమ్స్‌కే రిఫర్‌ చేశారు.

ఇంకా నిలోఫర్‌, ఈఎన్‌టీ, సరోజినీ, ఛాతీ, మానసిక చికిత్సాలయం, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి, ఇలా వేర్వేరు ఆసుపత్రుల నుంచి కార్డియాలజీ సేవల కోసం వస్తున్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం 2 క్యాథ్‌ల్యాబ్‌లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సేవలు అందించినా రోజుకు 50-60 మందికి మాత్రమే చికిత్స అందించగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యవసర సేవల పరిస్థితి గాలిలో దీపంలా మారింది.

ఇదీ చూడండి: 'వ్యవసాయంపై కొవిడ్​ 2.0 ప్రభావం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.