ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త.. ఏపీలో మధుమేహ కేసులు పెరుగుతున్నాయ్..

author img

By

Published : Feb 6, 2023, 11:06 AM IST

Diabetes cases are increasing in AP
ఏపీలో మధుమేహ కేసులు పెరుగుతున్నాయి

DIABETIC CASES IN AP: మధుమేహం ఉందా..కాళ్లపై చిన్న పుండు పడిందా.. గాయమైందా.. ఇనుప మేకు గుచ్చుకుందా అయితే తస్మాత్‌ జాగ్రత్త. అశ్రద్ధా లేకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి..లేకుంటే.. ఇన్‌ఫెక్షన్‌ సోకి కాలి వేళ్లు, పాదాలు, కాళ్లను తొలగించాల్సి రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని.. మధుమేహం శరీరంపై తీవ్ర ప్రభావం చూపి కొందరు వికలాంగులవుతున్నారని చెబుతున్నారు

DIABETIC CASES IN AP: మధుమేహం నియంత్రణలో లేక కొందరు.. దివ్యాంగులుగా మారుతున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. బాధితుల్లో నిరుపేదలు, కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండటం.. మందుల వాడకం గురించి బాధితులూ పట్టించుకోక పోవడం, దురలవాట్లు.. వంటి కారణాలు వారిని జీవచ్ఛవాలుగా మారుస్తున్నాయి.

మధుమేహం తీవ్రత పెరిగి.. ఏపీలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రధాన బోధనాసుపత్రుల్లో నెలకు సగటున 15 నుంచి 20 మంది మోకాలి కింద వరకూ కాళ్లను కోల్పోతున్నారు. మరో 20 మందికి పాదం లేదా కాలి వేళ్లను తొలగించాల్సి వస్తోంది. అనంతపురం GGHలో వైద్యులు నెలకు 15 మంది మధుమేహ బాధితులకు శస్త్రచికిత్సల ద్వారా ఇన్‌ఫెక్షన్లను తొలగిస్తున్నారు.

50ఏళ్ల పైబడిన వారిలోనే ఎక్కువ: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రధాన బోధనాసుపత్రులకు ఓపీలో వచ్చేవారిలో 10నుంచి 15శాతం మంది మధుమేహ నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆరోగ్యం దెబ్బతిన్న వారే ఉంటున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో సమస్యలు ఎక్కువగా బయటపడుతున్నాయి. మధుమేహం వచ్చాక మొదటి పదేళ్లపాటు పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించకపోవడం వల్ల కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మందులు వాడుతున్నాం కదా అని మరికొందరు వైద్యుల దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు. మధుమేహాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా... గుండె, కళ్లు, మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి: శరీరంలో గ్లూకోజు ఎక్కువగా ఉంటే కాళ్లు, చేతులకు రక్త సరఫరా సరిగా ఉండదని.. స్పర్శను కోల్పోతారని...పాదాల్లో నాడులు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. సూదులు పొడిచినట్లు, మండినట్లు అనిపించడం, నొప్పి పుట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయని... పుండ్లు మానకుండా వేధిస్తుంటాయని ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఏలూరులో రైతు కూలీ బాధ: ఏలూరు జిల్లాకు చెందిన రైతుకూలీ.. పనికి వెళ్లినప్పుడు.. పొలంలో పాదంలోనికి ఇనుప మేకు దిగింది. స్థానిక వైద్యం పొందాడు. మళ్లీ మేకు దిగిన భాగంలో పుండు పెద్దది కావడంతో వైద్యులను సంప్రదించకుండా స్థానిక వైద్యాన్ని నమ్ముకున్నాడు. చివరికి కుడి కాలు పాదానికి పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌ సోకింది. ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

15 ఏళ్ల నుంచి మధుమేహం: విజయవాడ శివారు ప్రాంతానికి చెందిన నూకరాజుకు 15 ఏళ్ల నుంచి మధుమేహం ఉంది. చెప్పుల దుకాణంలో పనిచేసే ఈయనకు పదేళ్ల కిందటే గుండెకు రెండు స్టెంట్లు వేశారు. 8 నెలల కిందట ఎండలో నడిచినప్పుడు కాలికి బొబ్బ వచ్చింది. ప్రాథమిక వైద్యంతో మొదట్లో తగ్గినట్లే.. తగ్గి.. కొద్దిరోజులకే పుండు పెద్దదైంది. 4 నెలల కిందట శస్త్రచికిత్స ద్వారా కుడి కాలు మెకాలి కింద భాగాన్ని తొలగించారు. ఇటీవల ఎలుక కొరకడంతో రెండో కాలి పాదానికి గాయమైంది. ఇప్పుడు ఆ కాలినీ తీసేయాలని వైద్యులు చెబుతున్నారు.

"అనారోగ్యంతో ఆయన మంచానపడ్డారు. తోడుగా ఆసుపత్రిలో ఉండాల్సి రావడంతో పనులు చేసుకోవడానికి వీల్లేకుండా ఉంది. ఇద్దరం ఇలా ఉండేసరికి ఇల్లు గడవడం కష్టమవుతోందయ్యా"-జయ నాగదుర్గ, నూకరాజు భార్య

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మధుమేహ సంబంధిత అనారోగ్యాలతో బాధపడేవారికి 60 పడకలు కేటాయించారు. 40మంది దాకా ప్రస్తుతం ఇక్కడ.. చికిత్స పొందుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహార నియమాలు పాటించడం తప్పనిసరని.. వ్యాయామాలు చేస్తూ సమస్యను నియంత్రణలో ఉంచుకోవాలని..లేకపోతే అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఓపీకి వచ్చే వారిలో కొందరికి మధుమేహ లక్షణాలపై అవగాహన ఉండటం లేదని..వైద్యులు చెబుతున్నారు.

"కూలి పనులకు వెళ్తే తప్ప జీవనం సాగని వారు వైద్యానికి దూరంగా ఉంటున్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల మందులను మధ్యలో మానేస్తున్నారు. దీనివల్ల మధుమేహం తీవ్రత పెరిగి ప్రభావం చూపుతోంది. చివరి ప్రయత్నంగానే కాలి వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగిస్తున్నాం. మధుమేహ బాధితులు రక్తంలో గ్లూకోజ్‌ను పరీక్షించి చూసుకోవడం దైనందిన చర్యగా భావించాలి"-ప్రొఫెసర్‌ కె.అప్పారావు, హెచ్‌ఓడీ, విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రి

కూలీపనులు చేసుకోకుంటే జీవనం గడవదన్న వారు వైద్యానికి దూరంగా ఉంటున్నారు.మందులు వాడటంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. కొందరు మందులు వాడుతూ మధ్యలో మానేస్తున్నారు. దీని ప్రభావం వారికి వెంటనే తెలియకపోవడం కూడా సమస్యగా మారుతోందని.. వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్‌ విలువలు ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవాలని.. దురలవాట్లు మానుకోవాలని సూచిస్తున్నారు. గాయం చిన్నదైనపుడే మధుమేహగ్రస్తులు..సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

"ఓపీకి వచ్చే వారిలో కొందరికి మధుమేహ లక్షణాలపై అవగాహన ఉండటం లేదు. మూడు నెలలకోసారైనా వైద్యుల్ని సంప్రదించాలి. కిడ్నీలు, నాడులు దెబ్బతింటున్న సంకేతాలున్నాయా... గుండె జబ్బు సూచనలు కనిపిస్తున్నాయా... పరీక్షించుకోవాలి. రక్తంలో గ్లూకోజు స్థాయులు పరగడుపున 125 ఎంజీ/డీఎల్‌, భోజనం తర్వాత 200 ఎంజీ/డీఎల్‌ కన్నా ఎక్కువుంటే అప్రమత్తం కావాలి"-డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, జనరల్‌ ఫిజిషియన్‌, విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.