ETV Bharat / state

Dharani Portal Political Heat in Telangana : 'ధరణి దంగల్'.. పతాకస్థాయికి అధికార, విపక్షాల మాటల యుద్ధం

author img

By

Published : Jun 10, 2023, 10:41 AM IST

Dharani Portal
Dharani Portal

Dharani Portal in Telangana : ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో ధరణి పోర్టల్‌ రాజకీయ వేడిని రాజేసింది. సమీకృత కలెక్టరేట్‌ భవనాల్ని ప్రారంభిస్తూ జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్​ బహిరంగ సభల్లో ధరణిపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపివేయాలనే పార్టీనే కలపాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక ధరణిని కచ్చితంగా రద్దు చేసి తీరతామని పునరుద్ఘాటించింది.

Congress Leaders On Dharani Portal : అసెంబ్లీ ఎన్నికల పోరు దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి రాజుకున్న రాష్ట్రంలో.. ధరణి పోర్టల్‌ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పతాకస్థాయికి చేర్చింది. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న కాంగ్రెస్‌ నేతల మాటలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌, మంచిర్యాల జిల్లాల్లో బహిరంగ సభల్లో ధరణి పోర్టల్‌ కేంద్రంగానే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ను రూపొందించానన్న కేసీఆర్.. రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశామని తెలిపారు. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతు బీమా అమలవుతోందని, రైతు బొటనవేలితో మాత్రమే భూమి వివరాలు మారతాయని స్పష్టం చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే వాళ్లనే సముద్రంలో వేయాలని కేసీఆర్ సభల్లో పిలుపునిచ్చారు.

Revanth Reddy About Dharani Portal : ధరణి పోర్టల్​ను నిలిపివేయడంపై కాంగ్రెస్‌ పార్టీ మరింత స్వరాన్ని పెంచింది. ధరణికి వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ.. దానిని బంగాళాఖాతంలో వేస్తామని ప్రకటించింది. దీనిపై కేసీఆర్​ ఎదురుదాడిని తప్పుపట్టిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రైతు డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ధరణిని బరాబర్‌ రద్దు చేసి తీరతామని పునరుద్ఘాటించారు. కొద్ది మంది భూస్వాముల కోసమే కేసీఆర్ ధరణిని తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు.

Opposition Leaders On Dharani Portal : ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు కొనసాగుతుంటే.. బీఆర్​ఎస్​కు అనుకూల పార్టీగా ముద్రపడిన ఎమ్​ఐఎమ్​ కూడా ధరణిని వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ధరణి వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముస్లిం వర్గాల్లో నోటి మాట ద్వారా భూమిని బహుమతి ఇచ్చే హిబాను ధరణి గుర్తించడం లేదన్నారు. ఒక సర్వే నెంబర్‌లో ఒక స్థలంలో వివాదంలో ఉంటే... సర్వే నెంబర్‌ మొత్తం రిజిస్ట్రేషన్‌ జరగడం లేదన్నారు. హైదరాబాద్‌లో వ్యవసాయేతర భూమిగా మార్చడంలోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.

'ధరణితో చాలా కష్టంగా మారిందని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ధరణి వల్ల ప్రయోజనాలేంటో మీకే తెలియాలి. నోటి మాట ద్వారా స్థలాన్ని బహుమతి ఇచ్చే 'హిబా'ను ధరణి గుర్తించడం లేదు. ముస్లింలలో నోటి మాట ద్వారా బహుమతి ఇవ్వడాన్ని అంగీకరించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా గుర్తించడం లేదు. ఇదేం ధరణి? సామాన్యులు, పేదలు ధరణి వల్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సీఎంకు లేఖ రాశాను. ఇప్పుడు మరోసారి రాస్తాను. అక్కడకు చేరుతుందా? చూస్తారా? ఏం చేస్తారన్నిది వారి ఇష్టం.'-అసదుద్దీన్​ ఓవైసీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.