ETV Bharat / state

'కరోనాపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి'

author img

By

Published : May 5, 2021, 2:33 PM IST

cpm meeting on corona situations
కరోనాపై సీపీఎం సమావేశం

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్​ చేశారు. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయని ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కల్లోలం సృష్టిస్తోందని.. నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శులతో హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో తమ్మినేని సమావేశం నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.

గందరగోళంగా పరిస్థితులు

రాష్ట్ర వ్యాప్తంగా పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందులు, కిట్స్, టీకాల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారని తమ్మినేని పేర్కొన్నారు. టీకాల విషయంలో వైద్యారోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళంగా మారిందని ఆరోపించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం వద్ద పరీక్షలు, వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరి నిరాశతో వెనుతిరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో లేఖ రాశా..

పీహెచ్​సీల్లో టెస్టులు, వ్యాక్సినేషన్ రెండూ ఒకే చోట నిర్వహించడంతో కొవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం కేసీఆర్​కు గతంలో లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశాన్ని నిర్వహించి వారి సూచనలను తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.

ఇదీ చదవండి: సర్కారీ ఆసుపత్రుల్లో నిండిన వెంటిలేటర్, ఆక్సిజన్‌ పడకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.