Telangana HC on MLA Vanama Venkateshwara Rao Election Issue : కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై హైకోర్టు తీర్పు.. అదే తరహా ఎన్నికల వివాదాలపై ఉత్కంఠను రేకెత్తించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోర్టుల్లో కేసుల విచారణ.. నేతల్లో టెన్షన్ పెంచుతోంది. హైకోర్టులో మరో 28 మంది ప్రజాప్రతినిధుల ఎన్నికలపై వివాదాలు విచారణ దశలో ఉన్నాయి. ఎన్నికల పిటిషన్లను 12 మంది న్యాయమూర్తులకు విభజించటంతో.. కొంతకాలంగా విచారణలో వేగం పుంజుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ ఎన్నికపై పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఉప సభాపతి పద్మారావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, దివాకర్ రావు, సతీశ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, చెన్నమనేని రమేశ్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, మాగంటి గోపీనాథ్, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీలు శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డిపై పిటిషన్ల విచారణ వివిధ దశల్లో ఉంది.
Court Cases on MLAs in Telangana 2023 : వాటిల్లో అధికంగా ఎన్నికల అఫిడవిట్లకు చెందిన వివాదాలే ఉన్నాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టం, ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం అభ్యర్థి తనతో పాటు కుటుంబసభ్యుల వివరాలు సమర్పించాలి. అయితే క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలను తప్పుగా చూపారని.. ఆ కారణంగా వారి ఎన్నికను కొట్టి వేయాలని ఆయా పిటిషన్లలో పేర్కొన్నారు. ఎక్కువ పిటిషన్లలో రెండో స్థానంలో ఉన్న సమీప ప్రత్యర్థులే పిటిషనర్లుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ధర్మపురి ఎమ్మెల్యేగా తన ఎన్నికపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల హైకోర్టును కోరారు. పిటిషన్ను తిరస్కరించాలంటూ.. మంత్రి వేసిన పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ నివేదికను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకపోవడంపై తన అభ్యంతరాలను మరోసారి పరిశీలించాలని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కోరారు. కొప్పుల ఈశ్వర్, లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు.. ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వివాదంపై విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.
కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నికపై.. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్పై విచారణకు ముగ్గురూ ఇటీవల హాజరై వాంగ్మూలాలిచ్చారు. రాఘవేంద్రరాజు అనే వ్యక్తి తనపై వేసిన పిటిషన్ను తిరస్కరించాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. సోమవారం నుంచి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల వివాదంపై దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలన్న ఎంపీ బీబీ పాటిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఆ ఇద్దరిపై ఎన్నికలేతర కేసులు..: మరోవైపు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్పై.. ఎన్నికలేతర కోర్టు కేసుల్లో విచారణ వేగంగా సాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో గనుల శాఖ మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సబితా ఇంద్రారెడ్డిపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
ఓఎమ్సీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు.. రోజువారీ విచారణ చేస్తోంది. కొన్ని నెలల్లో విచారణ కొలిక్కి వస్తుందని న్యాయవాదుల అంచనా. చెన్నమనని రమేశ్.. పౌరసత్వ వివాదంపై విచారణ హైకోర్టులో తుది దశలో ఉంది. ఎన్నికల్లోపు వివాదంపై హైకోర్టు తీర్పు వెలువడవచ్చునని న్యాయవాదుల అంచనా. అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వస్తున్న తరుణంలో ఎన్నికల పిటిషన్లు, కోర్టు కేసుల వివాదాలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కేసుల విచారణ పురోగతి, ఆరోపణల తీవ్రతపై అధిష్ఠానం ఆరా తీసినట్లు సమాచారం.
ఇవీ చూడండి..
CM KCR Warns BRS MLAs : హ్యాట్రిక్ కోసం.. ఈ 15 మంది సిట్టింగ్లపై వేటు తప్పదా..!
Nalgonda Congress Politics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కాంగ్రెస్కు చెక్ పెట్టేలా BRS ప్లాన్