ఎస్సీలు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని... మరియమ్మ (Mariyamma)లాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)ను కోరినట్లు కాంగ్రెస్ శాసనసభా పక్షం తెలిపింది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క (Clp Bhatti Vikramarka) నేతృత్వంలో సాయంత్రం ప్రగతిభవన్కు వెళ్లిన ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. దాదాపుగా గంటకు పైగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
మరియమ్మ లాకప్డెత్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్న నేతలు... ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామన్న మల్లు భట్టివిక్రమార్క... బాధిత కుటుంబానికి ఉద్యోగం, పరిహారం, ఆర్థికసాయం అందించేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదన్నదే తమ లక్ష్యమన్న ఆయన... గతంలోనే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినట్లు చెప్పారు.
మేం రాత్రి పూట కలవం...
కాంగ్రెస్ను బీ టీమ్ అంటున్నవారే అధికార పార్టీతో కుమ్మక్కయ్యారన్న భట్టి... భాజపా, ఆ పార్టీ నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమేలని వ్యాఖ్యానించారు. నిత్యం పరస్పరం పొగడ్తలు చేసుకునే భాజపా, తెరాసలు మమ్మల్ని విమర్శించడం సబబు కాదన్నారు. భాజపా నేతల్లాగా తాము రాత్రి పూట తెరాస నేతలను కలవడం లేదన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి... భాజపా దళిత వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. మరియమ్మ వ్యవహారంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
జరిగినటువంటి సంఘటన కడు హృదయవిదారకమైంది. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని తలుపులను తట్టాం. అందులో భాగంగానే సీఎం అపాయింట్మెంట్ కోరాం. మరియమ్మ కుటుంబానికి ఆదుకోవాల్సిన విషయాలపై ఆయనకు సూచించాం. అందుకు సీఎం ఒప్పుకున్నారు. నేను అపాయింట్మెంట్ తీసుకుంది కేవలం మరియమ్మకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై వివరించడానికే తీసుకున్నా.
-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చూడండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం