ETV Bharat / state

లక్ష్యం అందుకోలేదు.. నిరాశపరిచిన వాణిజ్య పన్నుల వ‌సూళ్లు

author img

By

Published : Feb 14, 2023, 7:46 PM IST

Commercial Tax Income
Commercial Tax

Commercial Tax Income Decrease: తెలంగాణ వాణిజ్య ప‌న్నుల శాఖ ఆదాయం త‌గ్గుతోంది. ఆర్థిక శాఖ నిర్దేశించుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌టం లేదు. నిరుడితో పోలిస్తే రెండు శాతం త‌గ్గిన‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. గ‌తేడాది కంటే 16 శాతం పెరుగుతుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. కానీ ప్ర‌స్తుతం ఆ ల‌క్ష్యం నెర‌వేర‌లేదు.

Commercial Tax Income Decrease in Telangana: ఆర్థిక సంవ‌త్స‌రం 2022-23 త్వ‌ర‌లో మ‌రి కొద్ది రోజుల్లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలోని ఆయా శాఖ‌లు.. త‌మ ప‌నితీరు, నిర్దేశించుకున్న ల‌క్ష్యాలు, ఎంత‌వ‌ర‌కు చేరుకున్నాం అని బేరీజులు వేసుకుంటున్నాయి. అనుకున్న ల‌క్ష్యానికి చేరుకున్నామా ? లేక‌పోతే దాన్ని సాధించ‌డానికి ఏయే చ‌ర్య‌లు తీసుకోవాలి అని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు.

రాష్ట్రానికి ఆదాయం తెచ్చి పెట్టే ప్ర‌ధానమైన శాఖ‌ల్లో వాణిజ్య ప‌న్నుల శాఖ ఒక‌టి. అన్నింటిలాగే ఇది కూడా ఆదాయానికి సంబంధించి ల‌క్ష్యం నిర్దేశించుకుంది. కానీ దీన్ని చేరుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. గ‌తంతో పోలిస్తే ఈ ఏడాది రాబడి త‌గ్గింది. పోయిన సంవ‌త్స‌రం జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ఆదాయం క‌న్నా ఈ సారి 2 శాతం తగ్గింది. గడిచిన పది నెలల్లో రూ.58,966.11 కోట్లు రాబడి వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. అనుకున్న ల‌క్ష్యం చేరుకోవ‌డానికి ఇంకా దూరంలోనే నిలిచిపోయింది. ఇప్ప‌టికి వ‌చ్చిన ఆదాయం కాకుండా.. ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.16,423.93 కోట్లు రావాలి. అప్పుడే నూరు శాతం ఫ‌లితాలు సాధించింది అవుతుంది.

ఈ శాఖ‌కు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో నెలకు సగటున రూ.5,418.45 లెక్క‌న మొత్తం రూ.65,021.42 కోట్లు మేర ఆదాయం వచ్చింది. 2022-23 లో ఇది మ‌రింత పెరుగుతుంద‌ని అధికారులు అనుకున్నారు. ఈసారి రూ.75,390.04 కోట్లుగా ఉంటుంద‌ని వారు అంచ‌నా వేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అంటే గ‌డ‌చిన ప‌ది నెలల్లో రూ.58,966.11 కోట్లు ఆదాయం వచ్చింది. ముందుగా నిర్దేశించుకున్న ల‌క్ష్యం నెర‌వేరాలంటే.. మిగిలిన మ‌రో రూ.16,423.93 కోట్లు రావాల్సి ఉందని ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ మొత్తం మిగిలిన రెండు నెల‌ల్లో రావాల్సి ఉంది.

ఇప్పటి వరకు వచ్చిన రాబడులను పరిశీలిస్తే సగటున ఒక్కో నెలకు రూ.5,896.60 కోట్లు వచ్చింది. ఈ లెక్కన తీసుకుంటే.. ఫిబ్ర‌వ‌రి, మార్చి వ‌ర‌కు ఒక్కో నెలలో రూ.8,212 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే అంత మొత్తం వచ్చే అవకాశాలు లేవని అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వస్తున్న వ్యాట్‌, జీఎస్టీ, వృత్తి పన్నులను పరిశీలించినట్లయితే పెట్రోల్‌ విక్రయాలపై వస్తున్న వ్యాట్‌ రాబడి గడిచిన పది నెలల్లో రూ.12,597.14 కోట్లు వచ్చి 14 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది మద్యం విక్రయాలపై వస్తున్న వ్యాట్ రూ.11,905.53 కోట్లుగా ఉంది. అంటే కేవలం 6 శాతం వృద్ధి కనపరిచింది. వృత్తి పన్నుఈ ఏడాదిలో జనవరి వరకు రూ.521.07 కోట్లు వచ్చి 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక జీఎస్టీని తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో జ‌న‌వ‌రి వ‌ర‌కు రూ.31,368.04 కోట్లు వచ్చి ఏకంగా 28శాతం వృద్ది నమోదు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటి వరకు వాణిజ్య పన్నుల శాఖకు వచ్చిన ఆదాయాన్ని చూస్తే.. రూ.70,759.24 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మ‌రింత పెంచ‌డానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వసూళ్లపై దృష్టి సారిస్తేనే సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.