ETV Bharat / state

TRS MLAs Poaching Videos : 'రూ.50 కోట్లు.. అన్ని ఎన్నికల్లో బీ ఫారాలు పక్కా'

author img

By

Published : Nov 4, 2022, 8:46 AM IST

TRS MLAs Poaching Videos: ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి సీఎం కేసీర్​ ప్రదర్శించిన వీడియోల్లో పలు కీలకాంశాలు బయటకొచ్చాయి. భాజపాలో చేరే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి.. రూ.50 కోట్లు ఇస్తామని చెప్పిన రామచంద్రభారతి, ఆ పార్టీ నుంచి బీ ఫారాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు ఉండవని హామీ ఇచ్చారు. భాజపాలో బీఎల్​ సంతోశ్​, అమిత్​షా, నడ్డాలే కీలకమని చెప్పిన రామచంద్రభారతి.. మరో 15 ఏళ్లు దేశంలో భాజపాదే అధికారమని వివరించారు. కాంగ్రెస్​కు నాయకత్వం లేదని.. విపక్ష పార్టీలు ఎప్పటికీ ఏకం కాలేవని పేర్కొన్నారు.

TRS MLAs Poaching Videos
TRS MLAs Poaching Videos

'తెరాస ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. కీలక వీడియోలు విడుదల చేసిన సీఎం

TRS MLAs Poaching Videos: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టయిన నిందితులు.. వారితో జరిపిన సంభాషణలకు సంబంధించిన దృశ్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్​ విడుదల చేశారు. ఈ కేసు కీలక నిందితుడు రామచంద్రభారతి.. మిగతా ఇద్దరు నందకుమార్, సింహయాజీతో కలిసి అనేక విషయాలను నలుగురు ఎమ్మెల్యేలకు వివరించారు. భాజపాలో ముగ్గురు కీలక నేతలు బీఎల్​ సంతోశ్​, అమిత్​షా, జేపీ నడ్డా అన్ని విషయాలు చూసుకుంటారని చెప్పారు. దిల్లీలో అమిత్​షా, బీఎల్​ సంతోశ్​, జేపీ నడ్డాలను కలిసి మీతో మాట్లాడిందంతా వారికి సందేశం పంపామని తెలిపారు. అమిత్​షాతో చెప్పాక.. దిల్లీలో మీరు కలిసే తేదీని ఖరారు చేస్తామన్నారు. మునుగోడు ఎన్నిక కంటే ముందే ఈ ఆపరేషన్​ పూర్తి కావాలని, ఒకసారి అంగీకరించాక మీ బాధ్యత మాదేనని పేర్కొన్నారు.

రామచంద్రభారతి: అందరికీ రూ.50 వస్తాయి.. అంటే రూ.50 కోట్లు.

రామచంద్రభారతి: పార్టీలో రాజకీయాల వరకు అమిత్​షా, బీఎల్​ సంతోశ్​, తుషార్​ చూసుకుంటారు. మొదట బీఎల్​ సంతోశ్​ అన్ని అంశాలను చూసుకుంటారు. ఆయన సహచరుడు తుషార్. వీరిద్దరు ఒప్పుకొంటే విషయం అమిత్​షా, జేపీ నడ్డా వరకు వెళ్తుంది. వారిద్దరు ఒకేసారి నిర్ణయాలు తీసుకుంటారు. నాకు మీ గురించిన సమాచారం వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని సంతోశ్​, తుషార్, అమిత్​షాకు పంపాను. మేం ఇక్కడి నుంచి వెళ్లే ముందే అన్ని విషయాలను క్లియర్​ చేస్తాం. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలందరికీ బీ ఫారాలు పక్కా. రాజకీయ జీవితంలో నగదు సహకారం సహా మీకు కావాల్సినవన్నీ వస్తాయి. మీరంతా రోహిత్​తో టచ్​లో ఉండాలి.

తెలంగాణలో జాతీయ స్థాయి నాయకులు ఎవరూ లేరన్న రామచంద్రభారతి.. దేశంలోని 17 ప్రతిపక్ష పార్టీలు ఎన్నటికీ ఒకేచోటికి వచ్చి కూటమిగా ఏర్పాటు కాలేవన్నారు. కాంగ్రెస్​లో నాయకత్వం లేదన్న ఆయన.. దేశంలో మరో 15 ఏళ్ల పాటు దేశనాయకత్వం భాజపాదేనని తెరాస ఎమ్మెల్యేలతో చెప్పారు.

రామచంద్రభారతి: వచ్చే 15 ఏళ్ల పాటు భాజపా జాతీయస్థాయి నాయకత్వంలో ఉంటుంది. ఇది పక్కా. కాంగ్రెస్​లో నాయకత్వం లేదు. తెలంగాణలో జాతీయ నాయకులెవరూ లేరు. బీఆర్ఎస్​ జాతీయ పార్టీ అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా నిర్మాణ దశలోనే ఉంది. దేశంలోని 17 పార్టీలు కలిసి ఒక ప్రతిపక్ష కూటమిగా ఏర్పాటు కావడం సాధ్యం కాదు. అక్కడ అందరూ పీఎం అభ్యర్థులు. వారెవరూ ఎప్పటికీ ఒకచోటికి రారు. అందుకే 15 ఏళ్ల పాటు భాజపా అధికారానికి ఢోకా లేదు.

ఈవీఎంలు ఉన్నంతకాలం భాజపాకు ఢోకా లేదని నిందితులు వ్యాఖ్యానించారు.

రామచంద్రభారతి: ఈవీఎం మిషన్లను ఆపరేట్ చేయం. వాటితో ఆపరేషన్లు చేస్తుంటాం.

ఎమ్మెల్యేలు: అందుకేనేమో బ్యాలెట్​ విధానం రావాలని అంటున్నారు. బ్యాలెట్​ వల్ల సమస్యలుంటాయి. ఈవీఎంను మీరు హ్యాక్​ చేయలేరు. పని చేసే వ్యూహం వేరుగా ఉంటుంది.

కర్ణాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాల మార్పిడికి సంబంధించిన వ్యవహారాన్ని తామే చక్కబెట్టామని ఎమ్మెల్యేలకు రామచంద్రభారతి, సింహయాజీ వివరించారు. తెలంగాణలో పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆంధ్రప్రదేశ్​తో పాటు మిగతా రాష్ట్రాలపై దృష్టి పెడతామని వివరించారు.

రామచంద్రభారతి: కర్ణాటక ఆపరేషన్​ గురించి మీకు తెలుసా. అవును 16 మందిని కాంగ్రెస్​ నుంచి భాజపాలోకి మార్చాం. ఆంధ్ర, తెలంగాణల్లో రాజకీయాలు వేరేలా ఉన్నాయి. చాలా పెద్ద తేడానే ఉంటుంది. ఇక్కడ ఒక నియోజకవర్గానికి పెట్టే ఖర్చుతో ఒక రాష్ట్రానికి ఎన్నికలే నిర్వహించవచ్చు. ఇక్కడ రాష్ట్ర ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల్లోకి రావడం అంత తేలిక కాదు.

మునుగోడులో భాజపానే గెలుస్తుందని చెప్పిన నిందితులు.. రాజగోపాల్​రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ అని.. ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారని తెలిపారు. పార్టీ రూ.30 కోట్లు ఇచ్చిందని, ఇంకా రూ.20 కోట్లు వస్తాయని వెల్లడించారు.

ఇవీ చూడండి..

న్యాయవ్యవస్థకు చేతులెత్తి ప్రార్థిస్తున్నా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: కేసీఆర్

ఇప్పటికే 8 ప్రభుత్వాలు కూల్చేసిన BJP.. నెక్ట్స్ టార్గెట్ ఆ 4 రాష్ట్రాలు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.