ETV Bharat / state

CJI AT AIMC: దేశ విదేశాల చూపు హైదరాబాద్‌ ఐఏఎంసీ వైపే: సీజేఐ

author img

By

Published : Dec 19, 2021, 3:31 AM IST

దేశ విదేశాల చూపు హైదరాబాద్‌ ఐఏఎంసీ వైపే ఉంటుందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్​లోని నానక్‌రాంగూడలోని ఫీనిక్స్‌ వీకే టవర్స్‌లోని ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీజేఐ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల(ఏడీఆర్‌) ధోరణి పెరగడానికి ఈ కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు.

CJI opened AIMC in hyderabad
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం

CJI AT AIMC: దేశ, విదేశాలకు చెందినవారు ఆర్బిట్రేషన్‌ కోసం ఇక నుంచి హైదరాబాద్‌ ఐఏఎంసీ వైపు చూస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల(ఏడీఆర్‌) ధోరణి పెరగడానికి ఈ కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు. అంతర్జాతీయ కేంద్రాలకు దీటుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం(ఐఏఎంసీ) శనివారం ఘనంగా ప్రారంభమైంది. నానక్‌రాంగూడలోని ఫీనిక్స్‌ వీకే టవర్స్‌లోని 21, 22 అంతస్తులలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని కేంద్రమంతా కలియ తిరుగుతూ వసతులను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐఏఎంసీ కార్యాలయానికి సంబంధించిన పత్రాలను సీఎం సీజేఐకి అందజేశారు. కేంద్రం వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐఏఎంసీ సీఈవో సితేష్‌ ముఖర్జీ, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, రెండు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, ఇతరులు పాల్గొన్నారు. ఐఏఎంసీ ప్రారంభం అనంతరం జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశ, విదేశ పార్టీలు విదేశీ కేంద్రాలైన సింగపూర్‌, లండన్‌ల వైపు చూస్తున్నాయి.. ఇకపై హైదరాబాద్‌ కేంద్రం మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ విషయంలో దేశం, ఆసియాతోపాటు ప్రపంచానికి ఈ కేంద్రం బాటలు వేయగలదు. హైదరాబాద్‌ ఐఏఎంసీ సింగపూర్‌ కేంద్రం కంటే మెరుగైనది.

ఇంతకంటే గొప్ప ప్రాంతం లేదు

ది నా నగరం. దీనిపట్ల పక్షపాతం చూపుతున్నానని నిందించవచ్చు. నిజాయతీగా చెప్పాలంటే హైదరాబాద్‌కు ఒకరు అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరంలేదు. దేశంలోని గొప్ప నగరాల్లో ఇదొకటి. ఈ నగర శోభకు నా వంతు సాయం చేసినందుకు గర్వపడుతున్నా. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధిగా ఉన్న హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి. ఇక్కడ భిన్న సంస్కృతులు, భాషలవారున్నారు. ముఖ్యంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారు. ఐఏఎంసీని ఏర్పాటు చేయడానికి ఇంతకంటే గొప్ప ప్రాంతం లేదు

-సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

మధ్యవర్తిత్వం కొత్తదేమీ కాదు..

CJI NV Ramana on ICADR: 26 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దిల్లీలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రాన్ని(ఐసీఏడీఆర్‌) ప్రారంభిస్తూ ప్రజాస్వామ్యంలో తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా వివాదం పరిష్కారం కావాలని అన్నారు. లేకుంటే ప్రజలు చట్టాలను చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య రంగాలు సజావుగా సాగడానికి సమర్థమైన వివాద పరిష్కార మార్గం అవసరమని అప్పట్లోనే ఆయన నొక్కిచెప్పారు. ఆర్థిక సరళీకరణలో భాగంగా దేశ, అంతర్జాతీయ స్థాయిలో సాధ్యమైనంత అనుకూలంగా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వివాదాలను పరిష్కారించాల్సిన అవసరం వచ్చింది. ఆర్బిట్రేషన్‌, కన్సిలియేషన్‌ చట్టం-1996 ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతిని అందిస్తోందని ఆశిస్తున్నా. అయినా ఆర్బిట్రేషన్‌, మధ్యవర్తిత్వం కొత్తవేమీ కావు. నచ్చిన వ్యక్తుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునే విధానం గతంలోనూ ఉన్నదే.

అనతి కాలంలోనే కల సాకారం

CJI on kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనతి కాలంలోనే కల సాకారమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక జూన్‌ 12న హైదరాబాద్‌కు వచ్చినపుడు సీఎంతో చర్చించా. ఆగస్టునాటికి ఎంవోయూ, ట్రస్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తికావడం, 4 నెలల్లోపే ప్రయత్నాలన్నీ వాస్తవ రూపం దాల్చడం మన కళ్లతో చూస్తున్నాం. ఇక్కడ తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యాలు, సానుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపార, వాణిజ్య వివాదాలతోపాటు కుటుంబ వివాదాలకూ ఈ కేంద్రంలో పరిష్కారం లభిస్తుంది.

ఐఏఎంసీ శాశ్వత భవన నిర్మాణం కోసం దుర్గంచెరువు వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ,

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

ఈ కేంద్రాన్ని ప్రోత్సహించండి

IAMC CENTER: ఆర్బిట్రేషన్‌తో పరిష్కరించుకోవాలని చెబుతూ హైదరాబాద్‌ కేంద్రానికి వెళ్లాలని లలిత్‌ మోడీ కుటుంబానికి చెందిన కేసు విచారణ సందర్భంగా షరతు విధించాం. అలా కేంద్రం ప్రారంభంకాకముందే పెద్ద కేసు వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు ఆర్బిట్రేషన్‌కు పార్టీలను సూదూర ప్రాంతాలకు పంపకుండా అనుకూలంగా ఉన్న ఈ కేంద్రానికి సిఫారసు చేయాలని కోరుతున్నా. విదేశీ ఆర్బిట్రేషన్లు కూడా ఇక్కడికి వస్తున్నట్లు జస్టిస్‌ నాగేశ్వరరావు చెప్పారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’’ అని వెల్లడించారు.

స్థానిక ఒప్పందాలూ ఈ కేంద్రానికి వచ్చేలా చట్టాల సవరణ
ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

మన రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు.. పెద్దపెద్ద పరిశ్రమలతో జరిగే ఒప్పందాలకు సంబంధించిన వివాదాలూ పరిష్కారం కోసం ఐఏఎంసీకి వచ్చేలా రాష్ట్ర చట్టాలకు తగిన సవరణలు తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకువస్తామన్నారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు విషయంలో మనమంతా గర్వించదగ్గ వ్యక్తి, న్యాయవ్యవస్థ ఉన్నత శిఖరంగా ఉన్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రధాన భూమిక పోషించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమంలో తెలుగులో మాట్లాడదలచుకున్నానని చెప్పారు. సింగపూర్‌ కంటే మెరుగ్గా, హైదరాబాద్‌లో అన్నీ చేస్తున్నా సరైన ప్రచారం చేసుకోవడంలేదని విదేశాల్లోని తన స్నేహితులు చెబుతున్నారని వెల్లడించారు. ఐఏఎంసీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ‘‘స్థానిక ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కోసం ఈ కేంద్రానికే వచ్చేలా చట్టాలను సవరించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన మార్గదర్శనం చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావును కోరుతున్నా. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, అంతకుమించి హైదరాబాద్‌లో సౌకర్యాలున్నాయి. ఇక్కడే ప్రాక్టీస్‌ చేసి ఉన్నతస్థాయికి ఎదిగిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. హైదరాబాద్‌కు ఓ మంచి కేంద్రాన్ని తీసుకురావాలన్న లక్ష్యం మేరకు ఇది సాకారమైంది. కోర్టుల్లో పరిష్కారం కాని కేసులు ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించుకోవడం ప్రస్తుతం అంతర్జాతీయ ధోరణిగా మారింది. ఈ కేంద్రం దేశానికి, రాష్ట్రానికి, నగరానికి, వ్యవస్థకు మంచి పేరు తీసుకువస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇందుకు శుభసూచకంగా చాలా పెద్ద కేసు ఐఏఎంసీకి వచ్చింది. సీఎంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇంత పెద్ద కేంద్రాన్ని ఆవిష్కరణ చేసినందుకు జస్టిస్‌ ఎన్‌వీ రమణను మరోసారి అభినందిస్తున్నా. సత్వర ఏర్పాట్లు చేసిన పరిశ్రమల శాఖ మంత్రి, కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌లకు హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు.

దుర్గం చెరువు సందర్శనకు హైకోర్టు సీజేకు కేటీఆర్‌ ఆహ్వానం

దుర్గం చెరువు సందర్శనకు రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. దేశంలో అతి పెద్ద అమెజాన్‌ వ్యాపార కేంద్రం ఇక్కడ ఉందని న్యాయమూర్తులకు వివరించారు. సమావేశం అనంతరం అక్కడే ఉన్న మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐఏఎంసీ గొప్పదనాన్ని విదేశాల్లో ప్రచారం చేస్తానని, త్వరలో దావోస్‌ వెళ్తున్నానని, అక్కడ ఈ కేంద్రం గురించి వివరిస్తానన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.