Chandrababu: ప్రజాసమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల సమీక్షలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. వాటి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్న ఆయన... ప్రతి విభాగం మరింత క్రియాశీలకంగా ఉండాలని సూచించారు.
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగితే ఉపయోగం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరెవరు ఏం పని చేస్తున్నారో తనకు మొత్తం తెలుసున్న బాబు.. పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొందరు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అనుబంధ విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
ఇదీ చూడండి : Sabitha Indra Reddy : 'పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయండి'