ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది: హరీశ్​రావు

author img

By

Published : Apr 7, 2023, 5:01 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది: హరీశ్​రావు
కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది: హరీశ్​రావు

కొవిడ్ కేసులపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టెస్ట్- ట్రాక్- ట్రీట్- వ్యాక్సినేషన్ ప్రొటోకాల్ నిబంధనలు కొనసాగించాలని తెలిపింది. అయితే కేంద్రం సూచనలపై మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.

దేశంలో కొవిడ్‌ సన్నద్ధతపై రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. కరోనా పరిస్థితులపై మన్​సుఖ్​ మాండవీయ రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. గతంలో కరోనా పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా.. కేంద్ర, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పని చేయాలని కోరారు. టెస్ట్- ట్రాక్- ట్రీట్- వ్యాక్సినేషన్ ప్రొటోకాల్ నిబంధనలు కొనసాగించాలని రాష్ట్రాలకు సూచించారు.

రేపు, ఎల్లుండి జిల్లా స్థాయిలోని ప్రజారోగ్య అధికారులతో కొవిడ్ సంసిద్ధతను సమీక్షించాలని.. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులను మన్​సుఖ్ మాండవీయ కోరారు. ఏప్రిల్ 10, 11న దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా మాక్​డ్రిల్స్ నిర్వహించాలని తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రులను సందర్శించి ఈ మాక్​డ్రిల్స్​ను సమీక్షించాలని ఆయన మంత్రులకు సూచించారు. అత్యవసర హాట్‌ స్పాట్‌లను గుర్తించాలని, కరోనా పరీక్షలు, టీకాలు వేయడం,.. ఆసుపత్రి మౌలిక సదుపాయాల సౌకర్యాలను నిర్ధారించుకోవాలని మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది: కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు సొంతంగా కొనుగోలు చేయాలని కేంద్రం సలహా ఇస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే బయోలజికల్ ఈ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేస్తామని హరీశ్​రావు వెల్లడించారు.

పెరుగుతోన్న కేసులు..: మరోవైపు నిన్న మహబూబాబాద్ జిల్లాలో కొవిడ్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇటీవల తమ స్వగ్రామానికి వెళ్లొచ్చిన ముగ్గురు విద్యార్థులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో పాఠశాల స్టాఫ్‌ నర్సు వారిని ఈ నెల 4న జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడి సూచన మేరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా.. ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌, మరొకరికి నెగెటివ్‌గా బుధవారం రిపోర్ట్​లు వచ్చాయి. పాజిటివ్ వచ్చిన వారితో కలిసి తిరిగిన 48 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 13 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు నిన్న తెలిసింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు.

దేశంలోనూ కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 6,050 కేసులు నమోదు అయ్యాయి. గురువారంతో పోలిస్తే.. 700కు పైగా కేసులు పెరిగాయి. ఈ క్రమంలోనే క్రియాశీల కేసుల సంఖ్య కూడా 28,303 పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్‌

పొలం దారి మాయం.. మా భూమికి దారేదంటూ అన్నదాతల ఆవేదన

'మోదీకి చదువు విలువ తెలియదు'.. ప్రధాని విద్యార్హతపై సిసోదియా విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.