ETV Bharat / state

దేశాన్ని సుభిక్షం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి

author img

By

Published : Apr 20, 2022, 5:02 PM IST

minister Niranjan reddy
minister Niranjan reddy

శారీరక శ్రమ, పెట్టుబడి ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు జరగాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి సాంకేతికత సన్నకారు రైతులకు చేరవేయాలని చెప్పారు. సాంకేతిక రంగంలో ఆరో స్థానంలో భారత్ ఉన్నప్పటికీ మనషులను విభజించి కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు, రిస్క్‌ తగ్గించి ఆదాయాలు పెరిగేలా ప్రపంచ స్థాయి టెక్నాలజీ చిన్నసన్నకారు రైతులకు చేరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సీఐఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న 3వ అగ్రిటెక్ సౌత్ - 2022 సదస్సును మంత్రి ప్రారంభించారు. అగ్రిటెక్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.

అగ్రిటెక్ ప్రదర్శనలో కొలువుదీరిన 100 స్టాళ్లను మంత్రి నిరంజన్​ రెడ్డి తిలకించారు. కీలక వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, పనిముట్లు, ఆవిష్కరణలు, సూక్ష్మ సేద్యం, సేంద్రియ వ్యవసాయం, వినూత్న అంశాలను పరిశీలించారు. వ్యవసాయం... ఈ తరహా ప్రదర్శన కొత్త తరానికి ఇచ్చే సందేశం అని మంత్రి అన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, శారీరక శ్రమ దినాలు, రాబడి పెంపు సవాళ్లు అధిగమించేందుకు పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తల నేతృత్వంలో నవీన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇటీవల జవాబుదారీ లేని రాజకీయ వ్యవస్థ కొనసాగుతుందని కేంద్రంపై మంత్రి నిరంజన్​ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. వ్యవసాయ రంగం సరైన దారిలో ఉండకపోతే ఇతర రంగాలు బాగుండవని ప్రొఫెసర్ స్వామినాథన్ అంటుంటారని గుర్తు చేశారు. సాంకేతిక రంగంలో 6వ స్థానంలో భారత్ ఉన్నప్పటికీ మనషులను విభజించి కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నదులు సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు నిర్మించి దేశాన్ని సుభిక్షం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదని ధ్వజమెత్తారు. స్వరాష్ట్ర సాధన తర్వాత వ్యవసాయ రంగం పురోగమిస్తోందని... ఎనిమిదేళ్లలో దేశంలో ఎక్కడా 10 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు నిర్మించలేదని ఆక్షేపించారు.

'తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్​కే దక్కింది. ఒకప్పుడు రేషన్ బియ్యం తిన్న చరిత్ర మనది. ఇప్పుడు తెలంగాణలో పండించిన ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడం దురదృష్టం. అంటే ఆ స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో రైతుబంధు ప్రారంభించిన తర్వాత ఎనిమిది విడతల్లో ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసి లబ్ధిపొందేలా చేస్తే కూడా ఏ రాజకీయ పార్టీ అభినందించని కుసంస్కారం వారిది.' - నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పీజేటీఎస్ఏయూ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు, సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు వాగిష్ దీక్షిత్, శ్రీనివాసా ఫామ్స్ అధినేత సురేష్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి : 60+ ఏజ్​లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్​స్టార్.. అంతా లాక్​డౌన్​ మేజిక్​!

బీసీ హాస్టల్​లో వీడ్కోలు పార్టీ.. చికెన్​, బీర్లతో విద్యార్థుల దావత్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.