ETV Bharat / state

వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు వాళ్లే.. అవినాష్, భాస్కర్​ రెడ్డిలకు బిగుస్తున్న ఉచ్చు

author img

By

Published : Feb 23, 2023, 9:57 AM IST

Updated : Feb 23, 2023, 10:07 AM IST

vivek murder case
వివేకా హత్య కేసు

YS Vivekananda Reddy murder case: వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఎంపీ అవినాశ్ ​రెడ్డి అతడి తండ్రి భాస్కర్​రెడ్డిలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇంకా అసలు విషయాలు బయటకు రావాలంటే నిందితుడు సునీల్​ యాదవ్​కు​ బెయిల్​ ఇవ్వొద్దని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.

YS Vivekananda Reddy murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐ ఒక కొలిక్కి తెచ్చింది. అసలు నిందితులు ఎవరో చెప్పకనే చెప్పింది. దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఈ కౌంటర్​లో ఈ కింది విషయాలను సీబీఐ పేర్కొంది.

CBI on YS Vivekananda Reddy murder case : వైఎస్​ వివేకా హత్య జరిగిన రాత్రి సునీల్​ యాదవ్​, తదితర నిందితులు కడప ఎంపీ అవినాష్​ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ పేర్కొంది. కుట్రలో భాగంగానే వివేకా హత్య ప్రణాళికను అవినాష్​ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దాచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందని సీబీఐ వివరించింది. సాక్ష్యాల ప్రకారమే శివశంకర్​రెడ్డితో కలిసి అవినాష్​రెడ్డి, భాస్కర్​రెడ్డి కుట్ర పన్నిన సూచనలు కనిపిస్తున్నాయని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఆ కుట్రలో భాగంగానే గుండెపోటు, రక్తవిరేచనాల కథ అల్లారని సీబీఐ అధికారులు తెలిపారు. హత్య జరిగిన స్థలం నుంచే అవినాష్​ రెడ్డి ఓ నంబరుకు ఫోన్ చేసి సుమారు నాలుగు నిమిషాలు మాట్లాడినట్లు వివరించారు.

అవినాష్​రెడ్డి ఇంట్లోనే సునీల్​ యాదవ్​: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ కోరింది. దర్యాప్తు కొనసాగుతోందని.. ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన పలు అంశాలను కౌంటరులో వివరించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పేర్లను కౌంటరులో సీబీఐ ప్రస్తావించింది. వివేకానందరెడ్డి హత్యకు కొన్ని గంటల ముందు వై ఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది.

వివేకా హత్య కోసం గొడ్డలి తీసుకురావడానికి కదిరి వెళ్లిన దస్తగిరి కోసం సునీల్ యాదవ్ ఎదురు చూస్తున్నట్లు తేలిందని సీబీఐ తెలిపింది. హత్యకు ముందు వివేకాతోపాటు ఉన్న గంగిరెడ్డి 6.18 నుంచి 6.30 మధ్య సునీల్​కు రెండుసార్లు ఫోన్​ చేశారని చెప్పింది. హత్య ఘటన వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు 2019 మార్చి 15న నిందితులు శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి తదితరులు భాస్కర్‌రెడ్డి, అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని తెలిపింది.

హత్యకు సహకరించిన గంగిరెడ్డి: శివశంకర్‌రెడ్డిని ఆరెస్ట్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులతో కోర్టుకు వచ్చి హల్​చల్​ చేసినట్లు సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డి అనుచురులు సీబీఐకి అడ్డంకులు కల్పించారని.. ప్రధాన నిందితుడైన శివశంకరెడ్డిని అస్పత్రి ప్రారంభం సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో అవినాష్ ​రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు వేసి తన రాజకీయ పలుకుబడిని ప్రదర్శించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది.

హత్య జరిగిన రాత్రి ఎనిమిదిన్నరకు అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్​ను దస్తగిరిని కలిశాడని పేర్కొంది. పథకం ప్రకారం భాస్కర్‌రెడ్డి ఆ రోజు తన రెండు ఫొన్లను స్విచ్ఛాఫ్ చేశారని వ్యాఖ్యానించింది. వివేకా ఇంటి సమీపంలో సునీల్ యాదవ్, గంగిరెడ్డి మద్యం తాగుతూ వేచి చూస్తూ.. వివేకా కారు, ఇంటిలోకి వెళ్లిన విషయాన్ని గుర్తించారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిలు వివేకా ఇంటిలోకి వెళ్లేందుకు రావడానికి గంగిరెడ్డి సహకరించినట్లు విచారణ తెలిసిందని సీబీఐ వివరించింది.

వివేకాతో బలవంతంగా రాయించిన లేఖ: ఈ సమయంలో ఎందుకు వచ్చారని వివేకా ప్రశ్నించగా డబ్బు లావాదేవీలు మాట్లాడటానికి వచ్చాడనీ గంగిరెడ్డి సర్దిచెప్పారని.. కాసేపటికి సునీల్‌ యాదవ్ దుర్భాషలాడుతూ వివేకా ఛాతిపై కొట్టగా.. దస్తగిరి నుంచి ఉమాశంకర్ రెడ్డి గొడ్డలి తీసుకొని కొట్టినట్లు సీబీఐ వివరించింది. వీరి పథకంలో భాగంగా డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించి.. బాత్రూంలోకి తీసుకెళ్లి తలవెనుక ఏడెనిమిది సార్లు ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో కొట్టాడని.. మర్మాంగాలపై సునీల్ యాదవ్ తన్నాడని సీబీఐ కౌంటర్ తెలిపింది.

వివేకా హత్యలో కీలక పాత్ర పోషించిన సునీల్​ యాదవ్​: వివేకా హత్యలో సునీల్ యాదవ్ కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ తెలిపింది. మొదట సన్నిహితంగా ఉన్న వివేకానందరెడ్డి.. ఆతర్వాత సునీల్ యాదవ్​ను దూరంగా పెట్టడంతో కక్ష పెంచుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. హత్యకు రూ.40 కోట్ల రూపాయల్లో రూ.5 కోట్లు వాటా ఇస్తామని గంగిరెడ్డి తెలిపినట్లు సీబీఐ పేర్కొంది.

'వై.ఎస్. భాస్కర్‌రెడ్డి, డి.శంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వై.ఎస్.మనోహర్రెడ్డి తరఫున గంగిరెడ్డి డబ్బు తీసుకున్నాడు. దస్తగిరికి కోటి రూపాయలు అందజేసిన సునీల్ యాదవ్ అందులో నుంచి రూ.25లక్షలు ఉంచుకుని తిరిగి ఇస్తానని చెప్పాడు. ఈ డబ్బుతో దస్తగిరి ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి, ఒప్పందం అమలుకాకపోవడంతో తన వద్ద ఉన్న రూ.46 లక్షలను మిత్రుడు సయ్యద్ మున్నా వద్ద ఉంచాడు. పథకం రూపొందించిన 10 రోజుల ముందు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలు వివేకా కుక్కను కారుతో కొట్టి చంపేశారు. వివేకాను చంపేఅవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి 2019 మార్చి 12న సౌభాగ్యమ్మ హైదరాబాద్​కు ఓ పంక్షను నిమిత్తం వెళ్లగా, పరిస్థితులను గమనించి పధకాన్ని అమలు చేశారు. సునీల్ యాదవ్ గొడ్డలి కావాలని అడగటంతో పులివెందులకు 35 కిలోమీటర్ల దూరంలోని కదిరికి వెళ్లి దస్తగిరి గొడ్డలి తీసుకురాగా, దస్తగిరిని దుకాణాదారుడు గుర్తించాడు.'

ప్రధానంగా మారిన దస్తగిరి వాంగ్మూలం: 'బెంగళూరులో వాటా ఇవ్వలేదని గంగిరెడ్డి.. వివేకానంద్ రెడ్డి పైనా కక్ష పెంచుకోన్నారని దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వివేకాను చంపేయాలని చెప్పాడని.. ఒక్కడివే కాదని, మేము నీ వెంట ఉన్నామని, మనకు పలుకుబడి ఉన్న వ్యక్తులు మద్దతు ఇస్తారని శివశంకర్ రెడ్డి చెప్పగా దస్తగిరి ఆరా తీస్తే అవినాష్​రెడ్డి మిగిలిన పేర్లు గంగిరెడ్డి తెలిపాడు. రూ.40 కోట్లులో 5 కోట్లు వాటా ఉంటుందని శివశంకర్ రెడ్డి చెప్పాడని దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడించాడు. సునీల్ యాదవ్ ధైర్యం చెప్పాడని తెలిపాడు. వివేకా హత్యకు ముందు 13-15 తేదీల మధ్య రాత్రిపూట ఉండే వాచ్​మెన్​ కాణిపాకం వెళుతున్నట్లు వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి సమాచారం ఇచ్చాడని సీబీఐకి తగిన వివరాలను తెలియజేశాడు.'

కడప ఎంపీ సీటు విషయంలో వివేకాపై కక్ష పెంచుకున్న అవినాష్​రెడ్డి: 2013లో వివేకా కాంగ్రెస్​ను విడిచి, వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో టిక్కెట్ ఇవ్వలేదు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే వివేకా కడప ఎంపీ సీటుకు పోటీదారుగా మారుతారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయాడు. పులివెందుల డివిజన్ బాధ్యతలను భాస్కర్ రెడ్డి,అవినాష్ రెడ్డిలకు సన్నిహితుడైన శివశంకర్ రెడ్డి చూసుకునేవాడు. శివశంకర్రెడ్డి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చూడగా, అవినాష్​రెడ్డి, భాస్కర్​రెడ్డి కూడా టిక్కెట్ ఇప్పించడానికి ప్రయత్నించారు. టిక్కెట్ దక్కకపోవడంతో వీరు ముగ్గురు వివేకాపై కక్ష పెంచుకున్నారు. వీరికి గంగిరెడ్డి సహకారం అందించారు. 2019లో వివేకా చురుగ్గా ఉండటంతో రాజకీయ శత్రుత్వం పెరిగింది. కడప ఎంపీ సీటును షర్మిల, విజయమ్మల్లో ఒకరికి ఇచ్చి అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని వివేకా ప్రయత్నించారు. కడప ఎంపీ బరిలోకి నింపడానికి ఒప్పించాడు.

హత్య విషయం ముందే తెలుసు.. సాక్ష్యాలు ధ్వంసం: ఇదే విషయం ప్రజల్లోకి రావడంతో దీన్ని ఊహించిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు కుట్రకు ప్రయత్నించారు. వివేకాకు చెందిన 16 ఎకరాల ఆస్తికి బీనామీగా గజ్జల జగదీశ్వర్ రెడ్డి పేరుతో ఉండడంతో.. సర్పంచి ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి కుటుంబానికి వివేకా మద్దుతు పలకపోవడంతో కూడా ఒక కారణామని తెలిసిందని సీబీఐ కౌంటర్​లో పేర్కొంది. 2019 మార్చి 15న శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి తదితరులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించకముంచే హత్య సమాచారం తెలిసినా.. ఇతరుల ద్వారా బయట పడిన వెంటనే సాక్షాలను ధ్వంసం చేయడానికి వేచి ఉన్నారు. సమాచారం బయటికి వచ్చిన వెంటనే వెళ్లి సాక్ష్యాలను 5:20కి వెళ్లి ధ్వంసం చేశారు.

డ్రామా అడిన అవినాష్​రెడ్డి: ఎస్.శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ రాగా అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి,ఉమారెడ్డి, సురేందర్ రెడ్డి ప్రశాంత్రెడ్డి, రామవరెడ్డి,రమణా రెడ్డి పీఏలు వివేకా ఇంటికి వెళ్లారు. గజ్జల ఉదయ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. వివేకా హత్య జరిగిన రోజు ఉదయం స్థానిక నేత కె.శశికళ రాగా గుండెపోటు వచ్చిందని అవినాష్ రెడ్డి ఆమెను చెప్పారు. అవినాష్ రెడ్డి తన ఫోన్ నుంచి మరో నెంబర్​కి (9000266234)కి ఫోన్ చేశాడని దర్యాప్తులో తెలిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. తరవాత మరో రెండు కాల్స్ చేశాడు. తరవాత పీఏ రాఘవరెడ్డి ఫోన్ తో శంకరయ్య సీఐకి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో రక్తవాంతులు చేసుకుని చనిపోయారని, భద్రత కోసం పోలీసులను పంపాలని చెప్పాడు.

పోలీసులను పంపిన సీఐ సంఘటనా స్థలానికి చేరుకోకుండా.. హత్య విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే, రహస్యంగా ఉంచారు. కుట్రలో సహజ మరణంగా కట్టు కథ అల్లి చెప్పారు. నిందితులు సంఘటనా స్థలాన్ని క్లీన్ చేశారు. వివేకా గాయాలకు కట్టుకట్టి అస్పతికి తరిలించారు. శివశంకర్ రెడ్డికి సన్నిహితుడు ఎస్. గంగాధర్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఎంవీకృష్ణారెడ్డిలను కుట్రదారుల ప్రభావితం చేసినట్లు సిబీఐ అధికారులు వెల్లడించారు. గంగాధర్ రెడ్డి సీబీఐ ఆశ్రయించి వాంగ్మూలం ఇచ్చారు.

సీబీఐను ఆశ్రయించి వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్​ రెడ్డి: హత్యను తనపై వేసుకోవాలనీ ఇందుకుగాను అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలు రూ.10 కోట్లు ఇస్తారని శివశంకర్ రెడ్డి చెప్పారని గంగాధర్​ రెడ్డి వెల్లడించాడు. ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా సీబీఐ బెదిరిస్తోందంటూ మీడియా ముందుకు వచ్చారు. గత ఏడాది జూన్​లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇదేవిధంగా వివేకా మరణం గురించి అవినాష్ రెడ్డి చెప్పారని సీఐ వెల్లడించాడు. శివశంకర్ రెడ్డి బెదిరించినట్లు సీఐ వాంగ్మూలం ఇచ్చినా, తరువాత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలు ఇవ్వడానికి నిరాకరించాడు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయగా విధుల్లో చేరారు. ఉదయ్ రెడ్డిని విచారణకు పిలిపించగా నెల తరవాత సీబీఐపై ఫిర్యాదు చేశారని సీబీఐ వెల్లడించింది.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర పోషించారని ఈ దశలో బెయిలు ఇవ్వడం సరికాదని పేర్కొంది. సునీల్ యాదవ్ వాచ్ మెన్ రంగన్న గుర్తించారని వెల్లడించింది. అంతేగాకుండా దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతున్నాయని, సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని తెలిపింది. హత్య జరిగిన తరువాత సునీల్ యాదవ్ గోవా పారిపోయారని, బెయిలు ఇస్తే తిరిగి పారిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల బెయిల్​ పిటిషన్​ను కొట్టివేయాలని సీబీఐ హైకోర్టును కోరింది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 23, 2023, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.