ETV Bharat / state

CAG Report: పరిమితికి మించి అప్పులు.. సభ ఆమోదం లేకుండానే ఖర్చులు

author img

By

Published : Mar 16, 2022, 5:57 AM IST

CAG
CAG

CAG Report: రాష్ట్రంలో శాసనసభ ఆమోదం లేకున్నా భారీమొత్తంలో వ్యయం జరుగుతోందని కాగ్‌ పేర్కొంది. పద్దుల నిర్వహణపై కచ్చితత్వం లేదని అభిప్రాయపడింది. అప్పులు పరిమితికి మించి పెరిగిపోతున్నాయని వెల్లడించింది. ప్రభుత్వం పారదర్శక బడ్జెట్‌ విధానాలు అనుసరించాలని కాగ్‌ సూచించింది.

CAG Report: శాసనసభలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాగ్‌ నివేదికలను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా ఖర్చు చేయడం శాసనసభ అధికారాన్ని తగ్గించడమేనని కాగ్‌ పేర్కొంది. 2014-15 నుంచి అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన రూ. లక్షా 32వేల 547కోట్ల వ్యయాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉందని వెల్లడించింది. పద్దుల నిర్వహణపై ఆందోళన వ్యక్తంచేసింది. 2020-21 ఆర్థిక ఏడాది ఆదాయం గణనీయంగా తగ్గగా వ్యయం పెరిగినట్లు వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో 2020-21లోనే అత్యల్ప వృద్ధిరేటు నమోదైందని స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక ఏడాది మొదట్లో చేబదుళ్లపైఆధారపడాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్న కాగ్‌... గతఆర్థిక ఏడాదిలో దేశంలో 2.97శాతం తరుగుదల నమోదైనా రాష్ట్రం మాత్రం... 2.42 శాతం వృద్ధి నమోదు చేసిందని వెల్లడించింది. 2018-19 వరకు రెవెన్యూ మిగులులో ఉన్న రాష్ట్రం.. వరుసగా రెండేళ్లు 22 వేల 298 కోట్ల రెవెన్యూ లోటు నమోదు చేసిందని పేర్కొంది.

పెరిగిన రెవెన్యూ ఖర్చులు...

2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో రాష్ట్ర రెవెన్యూ రాబడి స్వల్పంగా... రూ. 1,630 కోట్లు తగ్గగా రెవెన్యూఖర్చులు రూ. 14వేల 414 కోట్లు పెరిగినట్లు కాగ్‌ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రాబడి రూ. 66,650 కోట్లు, పన్నేతర ఆదాయం కింద రూ. 6,101 కోట్లుగా ఉండగా... గతేడాదితో పోలిస్తే ఆ రెండూ స్వల్పంగా తగ్గాయని వివరించింది. గతేడాది కేంద్ర పన్నుల వాటా కింద రూ. 12 వేల 692 కోట్లు వచ్చినా గడిచిన మూడేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలిపింది. గతేడాది సహాయక గ్రాంట్లు కింద రూ. 15వేల471 కోట్లు రాగా... అవి క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. ఐతే 15వ ఆర్థిక సంవత్సరం సిఫారసు చేసిన ప్రత్యేక గ్రాంట్లల్లో రూ. 964 కోట్లు... రాష్ట్రానికి రాలేదని స్పష్టం చేసింది.

2019-20 ఆర్థిక ఏడాది రెవెన్యూఖర్చులు రూ. 1,08,798 కోట్లుకాగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చులు రూ. 1,23,212 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. మూలధన వ్యయం అంతకుముందు ఏడాది కంటే 2020-21లో రూ. 937కోట్లు తగ్గినట్లు స్పష్టం చేసింది. తప్పనిసరి ఖర్చులు ఏటికేడూ పెరుగుతున్నాయన్న కాగ్... రెవెన్యూ ఖర్చుల్లో 54శాతం అవే ఉంటున్నట్లు తెలిపింది. నీటిపారుదల ప్రాజెక్టులపై 2021 మార్చి వరకు పెద్దమొత్తంలో రూ. 1,44,399 కోట్లు మూలధన వ్యయమైనట్లు వివరించింది. విద్య, ఆరోగ్యంపై ఖర్చులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉన్నట్లు పేర్కొంది.

పరిమితికి మించి అప్పులు...

రుణం తీసుకునేందుకు సంస్థలకు ఇచ్చిన పూచీకత్తులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదన్న కాగ్‌ ఆయాసంస్థల ఆర్థికపరమైన పనితీరు, జవాబుదారీతనాన్ని ప్రభుత్వం నిర్దారించుకోవట్లేదని ఎత్తిచూపింది. రాష్ట్రంలో రెవెన్యూలోటు నమోదు కావడంతో, రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును మార్కెట్‌ రుణాల ద్వారా పూరించాల్సి వచ్చినట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు ఎఫ్​ఆర్​బీఎం చట్టం నిర్దేశించిన ప్రకారమే ఉన్నా... బడ్జెటేతర రుణాలు పరిగణలోకి తీసుకుంటే పరిమితికి మించి అప్పులున్నట్లు వెల్లడించింది. 2019-20లో తీసుకున్న రుణాల్లో 75శాతం, 2020-21లో తీసుకున్న అప్పుల్లో 76.53శాతం గతంలో తీసుకున్న రుణాలు చెల్లించేందుకే వినియోగించారని కాగ్‌ తెలిపింది. 2021 మార్చి 31నాటికి చెల్లించాల్సిన అప్పుల్లో రూ. 1,06,468 కోట్లు రానున్న ఏడేళ్లలో తీర్చాలని అందుకోసం వనరులు సమకూర్చుకోవాలని సర్కారుకు సూచించింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.