ETV Bharat / state

చివరి త్రైమాసిక ఆదాయం ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌

author img

By

Published : Mar 9, 2021, 5:14 AM IST

రానున్న ఆర్థిక సంవత్సరానికి వాస్తవిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆశావహ బడ్జెట్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా కారణంగా మొదట్లో ఆదాయాన్ని కోల్పోయినా.. చివర్లో రాబడులు బాగానే పెరిగాయి. చివరి మూణ్నెళ్ల ఆదాయ అంచనాలతో కొత్త బడ్జెట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వివిధ శాఖల ప్రతిపాదనలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పద్దు కసరత్తు కొనసాగుతోంది.

budget-based-on-last-quarter-income-in-telangana
చివరి త్రైమాసిక ఆదాయం ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఆదాయం ఆధారంగా.... బడ్జెట్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో మార్చి, ఏప్రిల్‌లో బాగా పడిపోయిన రాబడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాబడులు గరిష్ఠంగా ఉన్నాయి. మార్చిలో మరింత ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

వృద్ధి రేటు

2021-22లో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చే నిధులు, పన్నుల్లో రాష్ట్ర వాటాతో పాటు... రాష్ట్ర సొంత ఆదాయానికి సంబంధించి అధికారులు అంచనా రూపొందించారు. ఇందుకోసం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆదాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్​డీపీలోనూ వృద్ధి రేటు నమోదైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ బడ్జెట్​పై నిర్వహించిన భేటీలో ఈ వివరాలన్నింటిని సమీక్షించారు. రాబడులు క్రమేణా పెరిగిన నేపథ్యంలో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని, పరిమాణం పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

తగ్గిన కేంద్ర పన్నుల వాటా

ఈ ఆర్థిక సంవత్సరం అప్పులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో పన్నుల రాబడి, పన్నేతర రాబడితో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా తగ్గింది. సొంత పన్నుల రాబడిలో 10 శాతం, పన్నేతర రాబడిలో 90 శాతం తగ్గగా... కేంద్ర పన్నుల వాటా 38 శాతం మేర తగ్గింది. దీంతో అంచనాలను మించి 30 శాతం అధికంగా అప్పులు తీసుకొని ప్రభుత్వం నిధులు సమీకరించుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు 45 వేల కోట్లను మించే అవకాశం కనిపిస్తోంది.

కసరత్తు కొనసాగుతోంది

బడ్జెట్​పై శాఖలవారీగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కసరత్తు కొనసాగుతోంది. కొన్ని శాఖల ప్రతిపాదనలపై సోమవారం మంత్రి సమీక్షించారు. విద్య, పురపాలక, రహదార్లు-భవనాలు, గృహనిర్మాణం, అటవీశాఖల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. ఆయా శాఖల ప్రస్తుత కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన వ్యయం, పెండింగ్ బిల్లులతో పాటు వచ్చే ఆర్థికసంవత్సరానికి సంబంధించిన అవసరాలు, అంచనాలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఇవాళ మరికొన్ని శాఖలతో హరీశ్ రావు సమావేశం కానున్నారు. ఆయా శాఖల ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిస్తారు. సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయిలో సమీక్షించి బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపునిస్తారు.


ఇదీ చూడండి : కొవిడ్​ సమయంలో మహిళలదే కీలక పాత్ర: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.