ETV Bharat / state

మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే టీఎస్‌పీఎస్‌సీ నడుస్తోంది: లక్ష్మణ్‌

author img

By

Published : Mar 16, 2023, 5:48 PM IST

Laxman on TSPSC Paper Leakage Issue: ప్రశ్నాపత్రాల లీకేజ్‌ ఘటనకు మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. కేటీఆర్‌ కనుసన్నల్లోనే టీఎస్‌పీఎస్‌సీ నడుస్తోందని ఆరోపించారు. ఇంతపెద్ద స్కామ్‌లో ఇద్దరు చిన్న ఉద్యోగులను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.

Laxman
Laxman

Laxman on TSPSC Paper Leakage Issue: రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ మండిపడుతున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక ప్రభుత్వ మద్దతు ఉందని సర్కార్​ను విమర్శలతో ముంచెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తాజాగా స్పందించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సర్కార్​పై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే టీఎస్‌పీఎస్‌సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. లీకేజ్‌ ఘటనకు కేటీఆర్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కేసును సిట్​కు అప్పగించడంపై లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేపర్ లీకేజీ వెనక ఉన్న పెద్ద తలకాయల బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

'మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే టీఎస్‌పీఎస్‌సీ నడుస్తోంది. సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారి పోయాయి. నయీం కేసు దర్యాప్తును సిట్‌ ఇంతవరకు తేల్చలేదు. కీలక కేసుల్లో హడావుడి చేయటం తప్ప కేసులు పూర్తి చేయలేదు. 8 ఏళ్ల అవుతున్నా ఓటుకు నోటు కేసు ఇప్పటికీ తేలలేదు. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పోలీసు, నిఘా వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు.'-లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యడు

గ్రూప్‌-1 పరీక్షపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ ప్రభుత్వానికి పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజ్‌ కొత్త కాదని ధ్వజమెత్తారు. ఇంతపెద్ద స్కామ్‌లో ఇద్దరు చిన్న ఉద్యోగులను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. పరీక్షలను ఆలస్యం చేసి యువతను మళ్లీ మభ్య పెట్టే కుట్ర జరుగుతోందని లక్ష్మణ్ విమర్శించారు.

టీఎస్​పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలి: మరోవైపు ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చెంచల్ గూడ కేంద్ర కారాగారంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సహా ఏడుగురు యువ మోర్చా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానంగా కమిషన్‌ సంబంధిత అధికారులపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. తప్పు బీఆర్​ఎస్ ప్రభుత్వం చేసి తమ కార్యకర్త అని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వైఫల్యాలకు మంత్రి కేటీఆర్‌ ప్రధాన కారణంగా భావిస్తున్నామన్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.