ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోటీగా.. నేడు దీక్షకు సిద్దమైన బీజేపీ మహిళామోర్చా

author img

By

Published : Mar 9, 2023, 7:19 PM IST

Updated : Mar 10, 2023, 6:32 AM IST

BJP Mahila Morcha Deeksha in Hyderabad: బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ సిద్దమైంది. దిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం కవిత దీక్ష చేపడుతుండగా ఆమెకు ధీటుగా ఇవాళ నగరంలో మహిళా మోర్చా నేతలు బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు

Telangana BJP
Telangana BJP

BJP Mahila Morcha Deeksha in Hyderabad: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వివిధ పార్టీలు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కొన్ని పార్టీలు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో దూసుకెళ్తున్నాయి. ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద దీక్షకు సిద్ధమయ్యారు.

తామేమి తక్కువ కాదంటూ బీజేపీ కవిత దీక్షకు పోటీగా హైదరాబాద్​లో దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్సీ కవిత దిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేపడుతుండగా.. ఆమెకు ధీటుగా భాగ్యనగరంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతితో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియాలి: రాష్ట్రంలో మహిళలపై జరిగే అరాచకాలకు నిరసనగా చేపట్టే ఈ దీక్షలో మహిళా నేతలంతా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే దీక్షలో తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియాలని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా నేతలతో సమావేశమైన బండి సంజయ్‌... తెలంగాణ మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం, బెల్ట్ షాపులతో మహిళలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యానించారు. రేపటి దీక్షలో డీకే అరుణ, విజయశాంతి పాల్గొంటారని వివరించారు.

కేటీఆర్ ప్రస్టేషన్‌లో ఉన్నారు: సీఎం కేసీఆర్‌, కేటీఆర్, బీఆర్​ఎస్ అంటే ప్రజలకు విరక్తి కలుగుతుందని... అవినీతి కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ ప్రస్టేషన్‌లో ఉన్నారని ఈ రోజు ఆయన ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారో ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. ప్రజల్లో బీఆర్​ఎస్ అంటే వ్యతిరేకత పెరుగుతుందని... కేటీఆర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి... కవిత అరెస్టు అవుతుందనే మహిళా రిజర్వేషన్ అంశం తెరపైకి తెచ్చారని వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్ ప్రజా ప్రతినిధులను విచారణ సంస్థలు విచారిస్తే అప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడలేదన్న వివేక్.. ఇప్పుడు చెల్లి కవితను లిక్కర్ స్కాంలో విచారణ చేస్తారనగానే మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేదాక బీజేపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 10, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.